అన్ని జిల్లా కేంద్రాల్లో జియో 5జీ - తొలి రాష్ట్రంగా: జన్మభూమి కావడం వల్లే..!!
అహ్మదాబాద్: గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గడువు సమీపిస్తోంది. అన్ని పార్టీలు తమ ప్రచార ఉధృతిని పెంచాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం కావడం వల్ల- అందరి దృష్టీ ఈ ఎన్నికలపైనే నిలిచింది. ఫలితాలు ఎలా ఉంటాయనేది ఉత్కంఠభరితంగా మారింది. బీజేపీని అడ్డుకోవడానికి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంత వరకు ఈ ఎన్నికల్లో పోరాడతాయనేది త్వరలోనే తేలిపోనుంది.

పోలింగ్ షెడ్యూల్..
అధికారాన్ని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ విస్తృత ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తోంది. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ దీనికి ఏ మాత్రం తీసిపోని విధంగా ప్రచార ఉధృతిని కొనసాగిస్తోన్నాయి. గుజరాత్లో మొత్తం 182 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ నిర్వహించడానికి కేంద్ర ఎన్నికల సంఘం ఇదివరకే నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 1వ తేదీన 89 సీట్లు, 5వ తేదీన మిగిలిన 93 స్థానాలకు పోలింగ్ను షెడ్యూల్ చేసింది.

త్రిముఖ పోరు..
మొత్తం 4,90,89,765 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అదే నెల 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఈ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ కనిపిస్తోంది. కాంగ్రెస్తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తన వంతు ప్రయత్నాలు గట్టిగానే సాగిస్తోంది. బీజేపీకి ఇదివరకట్లా గెలుపు నల్లేరు మీద నడక కాకపోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. మరోసారి అధికారాన్ని అందుకోవడానికి శ్రమించక తప్పదనే విశ్లేషణలూ ఉన్నాయి.

ట్రయల్స్గా..
ఈ పరిస్థితుల మధ్య అక్కడ 5జీ నెట్వర్క్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ సారథ్యంలోని రిలయన్స్ జియో తన 5జీ సేవలను ప్రారంభించింది. మిగిలిన సర్వీస్ ప్రొవైడర్ల కంటే ముందుగానే ఈ సేవలను వినియోగదారులకు అందించింది. గుజరాత్లో ఉన్న మొత్తం జిల్లాల కేంద్రాల్లో 5జీ సర్వీసులను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకుని వచ్చినట్లు రిలయన్స్ తెలిపింది. ట్రయల్స్ నిర్వహిస్తోన్నట్లు పేర్కొంది.

జన్మభూమి కావడం వల్లే..
తమ సంస్థకు గుజరాత్ జన్మభూమి కావడం వల్లే దేశంలోనే మొట్టమొదటి సారిగా అన్ని జిల్లా కేంద్రాల్లో ట్రయల్స్ రూపంలో 5జీ నెట్వర్క్ను అందుబాటులోకి తీసుకుని వచ్చామని రిలయన్స్ ఇన్ఫోకామ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ తెలిపారు. ఎడ్యుకేషన్-ఫర్-అల్ పేరుతో కంపెనీ ట్రూ 5జీ సర్వీసులను చేపట్టామని, 100 పాఠశాలలను డిజిటలైజ్ చేయడానికి రిలయన్స్ ఫౌండేషన్- జియో కలిసి పని చేస్తోన్నాయని వివరించారు.

అన్ లిమిటెడ్ డేటాతో..
ఒక సెకెనుకు ఒక జీబీ ప్లస్ (వన్ జీబీపీఎస్ ప్లస్) వేగంతో అపరిమిత 5జీ డేటాను అందించనున్నామని ఆకాష్ అంబానీ అన్నారు. దీనికోసం అదనంగా ఎలాంటి మొత్తాన్ని యూజర్ల నుంచి వసూలు చేయట్లేదని చెప్పారు. డిసెంబర్ నాటికి కోల్కత, 2023 జూన్ నాటికి దేశం మొత్తంగా 5జీ పూర్తి కవరేజీని అందిస్తామని చెప్పారు.












Click it and Unblock the Notifications