కోవిడ్ కేసులు,మరణాల లెక్కల్లో పారదర్శకత పాటించండి... రాష్ట్రాలకు ప్రధాని మోదీ కీలక ఆదేశాలు...
కోవిడ్ వ్యాప్తిలో హై-పాజిటివిటీ రేటు ఉన్న రాష్ట్రాలు దానికి సంబంధించిన లెక్కలను పారదర్శకంగా వెల్లడించాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తద్వారా ప్రభుత్వ చర్యలపై ప్రతికూలత ఏర్పడదని అభిప్రాయపడ్డారు. హై-పాజిటివిటీ రేటు ఉన్న జిల్లాల్లో టెస్టింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులు,వ్యాక్సినేషన్ ప్రక్రియపై శనివారం(మే 15) మోదీ వర్చువల్ విధానంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. కరోనా ఉధృతి నేపథ్యంలో స్థానిక కంటైన్మెంట్స్ ఆవశ్యకతను నొక్కి చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇంటింటికీ టెస్టులు చేసేలా హెల్త్ కేర్ వ్యవస్థను తప్పక వాడుకోవాలన్నారు.కోవిడ్ వ్యాప్తిలో హై-పాజిటివిటీ రేటు ఉన్న రాష్ట్రాలు పారదర్శకంగా ఆ లెక్కలను వెల్లడించాలన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్(ఎల్ఎంఓ) పంపిణీకి సంబంధించి ఒక ప్రణాళికను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. కరోనా చికిత్సలో ఉపయోగించే మెడికల్ పరికరాలను ఉపయోగించేందుకు హెల్త్ కేర్ వర్కర్లకు తగిన శిక్షణ అందించాలన్నారు. మధ్యప్రదేశ్,ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో వెంటిలేటర్లను వాడకుండా పక్కన పడేశారన్న వార్తల నేపథ్యంలో ప్రధాని మోదీ కీలక ఆదేశాలిచ్చారు.
దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఎన్ని వెంటిలేటర్లు ఉపయోగిస్తున్నారో లెక్కలు తేల్చాలని అధికారులను ఆదేశించారు. వెంటిలేటర్లను ఆపరేట్ చేసేందుకు హెల్త్ కేర్ వర్కర్లకు తగిన శిక్షణ అందించాలన్నారు.
కాగా,పలు రాష్ట్రాలు కరోనా కేసులు,మరణాల లెక్కలను దాస్తున్నాయన్న విమర్శల నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. కరోనా లెక్కల విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలన్న ప్రధాని ఆదేశాలను ఇకనైనా అన్ని రాష్ట్రాలు పాటిస్తాయో లేదో చూడాలి.
Recommended Video
ఇక దేశంలో కరోనా కేసుల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో 3,26,098 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 3980 మంది కరోనాతో మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకూ 18 కోట్ల పైచిలుకు మందికి కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. భవిష్యత్తులో వ్యాక్సినేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.