ఓటేయండి ఉచితంగా మసాల దోశ తినండి: బెంగుళూరు ఓటర్లకు బంపర్ ఆఫర్
బెంగుళూరు: కర్ణాటక రాష్ట్రంలో పోలింగ్ శాతం పెంచేందుకు ఎన్నికల సంఘం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. అయితే బెంగుళూరులోని ఓ హోటల్ నిర్వాహకుడు పోలింగ్ సరళిని పెంచేందుకు వినూత్న ప్రచారాన్ని ప్రారంభించాడు.
బెంగుళూరులోని నిసర్గ గ్రాండ్ హోటల్ యజమాని కృష్ణ రాజ్ బెంగుళూరులో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు తన వంతు ప్రయత్నాలను ప్రారంభించాడు. ఈ ఎన్నికల్లోనే తొలిసారిగా ఓటు హక్కును వినియోగించుకొంటున్న వారికి ఉచితంగా దోశను ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అంతేకాదు ఓటు వేసిన ఇతర ఓటర్లకు మాత్రం కాఫీని ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు.
ఓటు హక్కును వినియోగించుకొన్నట్టుగా ఓటర్లు తమ చూపుడు వేలిపై ఉన్న సిరా గుర్తును చూపించాల్సిందే. ఈ గుర్తును చూపించినవారికి మాత్రమే ఉచితంగా దోశతో పాటు కాఫీని ఇవ్వనున్నట్టు ఆయన ప్రకటించారు.
బెంగుళూరులో తక్కువ ఓటింగ్ శాతం నమోదౌతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని ఓటింగ్ శాతాన్ని పెంచేందుకుగాను ఈ ప్రయత్నం చేసినట్టు హోటల్ నిర్వాహకుడు కృష్ణ రాజ్ చెప్పారు. అయితే ఓటర్లు తమ ఇష్టమొచ్చిన పార్టీకి ఓటు చేసుకోవచ్చని ఆయన సూచించాడు. కానీ, ఓటింగ్లో పాల్గొనాల్సిందిగా మాత్రం ఆయన సూచించారు.