కౌంటింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు: మూడంచెల్లో: సమస్యాత్మక ప్రాంతాల్లో..
న్యూఢిల్లీ: ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తూ వస్తోన్న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇవ్వాళ వెలువడనున్నాయి. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమైన అభ్యర్థుల భవితవ్యం ఇంకొన్ని గంటల్లో బహిర్గతం కానుంది. ఈ అయిదింట్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. గోవా, ఉత్తరాఖండ్లల్లో బీజేపీ-కాంగ్రెస్ మధ్య పోటాపోటీ ఉంటుందంటూ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేసిన నేపథ్యంలో- అక్కడ నంబర్ గేమ్ మొదలైంది.
సోమవారం వెలువడిన ఎగ్జిట్ పోల్స్ వల్ల.. ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే విషయం మీద ఓ అంచనా అనేది ఏర్పడింది. ఉత్తర ప్రదేశ్లో మళ్లీ యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ అన్ని ఎగ్జిట్పోల్స్ స్పష్టం చేశాయి. 2017 తరహాలోనే భారీ మెజారిటీని అందుకుంటాయని అంచనా వేశాయి. భారీ మెజారిటీతో ఆయన విజయఢంకా మోగిస్తారనేది ఇప్పటికే తేటతెల్లమైంది. దీనితో బీజేపీ విజయోత్సవాలను జరుపుకోవడానికి సిద్ధమైంది.
మరోవంక- పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును మోహరింపజేశారు కేంద్ర ఎన్నికల అధికారులు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్దా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ముందుజాగ్రత్త చర్యలన్నింటినీ తీసుకున్నారు. ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో పహారాను పెంచారు. కొన్ని చోట్ల 144 సెక్షన్ను విధించినట్లు వార్తలొస్తోన్నాయి. సమస్యాత్మక, సున్నిత ప్రాంతాల్లో భద్రతను రెట్టింపు చేశారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు.
పోలింగ్ కేంద్రాల్లో వెళ్లే ప్రతి ఒక్కరినీ పూర్తిస్థాయిలో తనిఖీలో చేసిన తరువాతే లోనికి పంపిస్తున్నారు. అన్ని పార్టీల ఏజెంట్ల గుర్తింపు కార్డులను పరిశీలిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కార్యకర్తలను ఎవ్వరినీ నిల్చోవడానికి అనుమతి ఇవ్వట్లేదు. 100 అడుగుల దూరంలోనే వారిని నిలిపివేస్తోన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద విజయోత్సవాలను నిర్వహించకూడదంటూ ఎన్నికల అధికారలు ఇదివరకే ఆదేశాలను జారీ చేసిన నేపథ్యంలో- వాటిని పకడ్బందీగా అమలు చేస్తోన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న ఇతర రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లల్లో భారీ భధ్రతను మోహరింపజేశారు అధికారులు. మణిపూర్లోని సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. అక్కడా మూడంచెల భద్రతను అందుబాటులోకి తీసుకొచ్చారు. కొన్ని చోట్ల పారా మిలటరీ బలగాలను సైతం రంగంలోకి దించారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు చేపట్టారు.