పెరిగిన రిటైల్ ద్రవ్యోల్బణం: ఎందుకు...
న్యూఢిల్లీ: వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం లేదా రిటైల్ ద్రవ్యోల్బణం నవంబరు నెలలో 4.88శాతంగా నమోదైంది. ఆహారపదార్థాల ధరలు గణనీయంగా పెరగడం, అకాల వర్షాలే ఇందుకు కారణంగా అంచనా వేస్తన్నారు.
నవంబరు నెలలో ద్రవ్యోల్బణం 4 శాతంగా నమోదవుతుందన్న రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) అంచనాలకు మించి నమోదైంది. అంతకుముందు నెల అక్టోబర్లో ద్రవ్యోల్బణం 3.59శాతంగా నమోదై ఆరు నెలల గరిష్ఠానికి చేరుకుంది.
దీనికి సంబంధించిన నివేదికను గురువారం వినియోగదారుల ధరల సూచీ(సీపీఐ) విడుదల చేసింది. ఆర్థికవేత్తలు అంచనా వేసినట్లుగానే నవంబరులో రిటైల్ ద్రవ్యోల్బణం 4.20శాతాన్ని దాటి 15నెలల గరిష్ఠానికి చేరుకుంది. మరోవైపు అక్టోబరు నెలలో పారిశ్రామిక ఉత్పత్తి 2.2శాతానికి పడిపోయింది.
నవంబరు నెలలో కురిసిన అకాల వర్షాల కారణంగా కూరగాయలు, పండ్ల తోటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. దీంతో ఉల్లిపాయలు, టొమాటో ధరలు పెరిగినట్లు లార్సన్ అండ్ టర్బో గ్రూప్ చీఫ్ ఎకనామిస్ట్ రూపా రేగే తెలిపారు.
ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందనే భయాందోళనతోనే ఇటీవల జరిగిన పాలసీ సమీక్షలో కూడా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా వడ్డీరేట్లను తగ్గించలేదు. రాయిటర్స్ అంచనాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 4.2 శాతానికి పెరుగుతుందని అంచనావేశారు. కానీ దాన్ని దాటిపోయింది.
డిసెంబర్ 6న జరిగిన పాలసీ సమావేశంలో ఆర్బీఐ తన ద్రవ్యోల్బణ అంచనాలను 10 బేసిస్ పాయింట్లు పెంచి 4.3 శాతం నుంచి 4.7 శాతం మధ్యలో ఉంటుందని అంచనా వేసింది. 2018 చివరి వరకు కూడా ఆర్బీఐ వడ్డీరేట్లను మార్చదని కొంతమంది ఆర్థికవేత్తలు భావిస్తున్నారు.