నా చావుకు మమతా బెనర్జీనే కారణం: సూసైడ్ నోట్లో సీనియర్ ఐపీఎస్ అధికారి గౌరవ్ దత్
కోల్ కతా: కోల్కతాలో సీనియర్ పోలీసు ఉన్నతాధికారి గౌరవ్ దత్ ఆత్మహత్య కలకలం సృష్టించింది. గౌరవ్ దత్ భార్య బీజేపీ నేత ముకుల్రాయ్తో కలిసి సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది. 1986వ ఐపీఎస్ బ్యాచ్కు చెందిన దత్ ఫిబ్రవరి 19న మృతి చెందాడు. అంతేకాదు తన మరణానికి కారణం సీఎం మమతా బెనర్జీనే అంటూ సూసైడ్ నోట్లో రాశాడు. ఈ సూసైడ్ నోట్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. తనను మమతా బెనర్జీ తనకు పోస్టింగ్ ఇవ్వకుండా వెయిటింగ్లో పెట్టారని సూసైడ్ నోట్లో పేర్కొన్న దత్... డిసెంబర్ 31న పదవీ విరమణ చేశాక కూడా తనకు ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలను నిలిపివేశారని ఆరోపించారు.
దత్ ఆత్మహత్యకు మమతా బెనర్జీనే కారణమంటూ నిప్పులు చెరిగారు బీజేపీ ఎంపీ ముకుల్ రాయ్. వెంటనే మమతను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కేసులో సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బెంగాల్ చరిత్రలోనే ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి ఆత్మహత్యకు పాల్పడటం ఇదే తొలిసారి అని అన్నారు ముకుల్ రాయ్. అది కూడా ఓ ముఖ్యమంత్రి పేరును సూసైడ్నోట్లో స్పష్టంగా పేర్కొన్నారని ముకుల్ రాయ్ తెలిపారు.
A 1986 batch IPS officer of West Bengal cadre GC Dutt committed suicide on February 19. He has accused West Bengal CM Mamta Banerjee for abetment. pic.twitter.com/4CV9uT3fwB
— Sumit Kumar Singh (@invincibleidea) February 21, 2019
గత మంగళవారం సాల్ట్ లేక్ ప్రాంతంలో ఉన్న తన నివాసంలో దత్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన చేతిని కట్ చేసుకుని రక్తపు మడుగులో పడిఉన్నారు. ఎవరూ లేని సమయంలో దత్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. తన భార్య ఇంటికి తిరిగి వచ్చేసరికి రక్తపు మడుగులో పడిఉన్న తన భర్తను చూసి షాక్కు గురైంది. వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అంతకుముందు మూడువారాల క్రితం కోల్కతాలో శారదా స్కాం విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీపీ రాజీవ్ కుమార్ను విచారణ చేసేందుకు వచ్చిన సీబీఐ అధికారులను కోల్కతా పోలీసులు చుట్టుముట్టారు. అనంతరం సీబీఐ తన రాష్ట్రంలో అడుగుపెట్టనివ్వబోమంటూ మమతా బెనర్జీ నిరసన వ్యక్తం చేశారు. తాజాగా దత్ ఆత్మహత్యతో అక్కడ రాజకీయంగా కూడా వాతావరణం ఆందోళనకరంగా మారుతోంది.