బాలీవుడ్ డ్రగ్స్ కేసు: అక్టోబర్ 20 వరకు మళ్లీ రియా రిమాండ్ పొడిగింపు..ఎన్సీబీ వాదన ఇలా !!
నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణానికి సంబంధించిన డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది . ముంబైలోని ప్రత్యేక ఎన్డిపిఎస్ కోర్టు రియా చక్రవర్తి, షోవిక్ చక్రవర్తి మరియు ఈ కేసులో అరెస్ట్ అయిన ఇతరుల రిమాండ్ను అక్టోబర్ 20 వరకు పొడిగించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సిబి) నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ మరణంతో ఇప్పటివరకు కనీసం 20 మందిని అరెస్టు చేసింది . వివిధ బాలీవుడ్ ప్రముఖులను విచారిస్తుంది.
రియాతో పాటు ఆమె సోదరుడికీ రిమాండ్ పొడిగించిన కోర్టు
బాలీవుడ్ డ్రగ్స్ కేసుతో పాటు సుశాంత్ సింగ్ రాజ్ పూత్ హత్యకేసులో నిందితురాలిగా ఉన్న రియా చక్రవర్తి బెయిల్ కోసం ప్రయత్నం చేస్తోంది .అయితే తాజాగా కూడా ఆమె రిమాండ్ ను కోర్టు అక్టోబర్ 20 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది అంతకుముందు సెప్టెంబర్ 11 న, రియా, ఆమె సోదరుడు షోయిక్ చక్రవర్తి మరియు ఇతరుల బెయిల్ పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఆమె బెయిల్ పై విడుదలైతే ఆమె ఇతర నిందితులను అప్రమత్తం చేయవచ్చని, వారు ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలను నాశనం చేయవచ్చని ఎన్సీబీ కోర్టు దృష్టికి తీసుకువెళ్ళింది.
రియాకు బెయిల్ ఇస్తే విచారణకు ఆటంకం కలుగుతుందన్న ఎన్సీబీ
బాలీవుడ్ డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తికి రిమాండ్ ను పొడిగించింది ఎన్డిపిఎస్ కోర్టు. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి రియా చక్రవర్తి జైల్లోనే ఉన్నారు. సెప్టెంబర్ 30న ఇరువర్గాల వాదనలు విన్న కోర్టు, తీర్పును రిజర్వులో ఉంచింది. రియా చక్రవర్తి కి బెయిల్ ఇవ్వవద్దని న్యాయస్థానానికి ఎన్సీబీ విజ్ఞప్తి చేసింది. ఒకవేళ రియా చక్రవర్తి కి బెయిల్ ఇస్తే విచారణకు ఇబ్బంది కలుగుతుందని,ఎన్సీబీ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. సుశాంత్ కు డ్రగ్స్ సరఫరా చేయడంలో రియా హస్తం ఉందని పేర్కొంది .
18పేజీల అఫిడవిట్ ను సమర్పించిన కోర్టు
ఆమె సోదరుడు షోవిక్ చక్రవర్తి కూడా ఈ వ్యవహారంలో ఉన్నాడని, ఇది తీవ్రమైన నేరమని కోర్టుకు తెలిపిన ఎన్సీబీ 18 పేజీల అఫిడవిట్ ను సమర్పించింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో వాదనతో ఏకీభవించిన కోర్టు రియా చక్రవర్తికి ఆమె సోదరుడు, షోవిక్ చక్రవర్తికి జ్యుడీషియల్ రిమాండ్ ను అక్టోబర్ 20వ తేదీ వరకు పొడిగిస్తూ ఇవ్వాళ తీర్పునిచ్చింది .ఇక మరోపక్క తనకు బెయిల్ ఇవ్వాలని , నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తనపై బలవంతంగా ఆరోపణలు చేస్తుందని, ఈ కేసును సీబీఐ కి అప్పగించాలని కోరుతూ రియా చక్రవర్తి బొంబాయి హైకోర్టులో పిటీషన్ దాఖలు చెయ్యగా ఈ పిటీషన్ పై విచారణ జరుగుతుంది. రేపు మరోమారు ఈ పిటీషన్ కోర్టులో విచారణకు రానుంది .
అరెస్టయిన వారందరూ ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యారంటున్న ఎన్సీబీ
సెప్టెంబర్ నెలలో, నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో, బాలీవుడ్ డ్రగ్ కేసులో నటి రియా చక్రవర్తి మరియు మరో ఐదుగురు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను వ్యతిరేకిస్తూ, ఇప్పటివరకు అరెస్టు చేసిన వారందరూ ఒకరితో ఒకరు కనెక్ట్ అయ్యారని, ఇది సిండికేట్ అని బొంబాయి హైకోర్టుకు తెలిపారు. వీరంతా డ్రగ్స్ కొనుగోళ్లలో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని పేర్కొంది . రియా మరియు షోయిక్ చక్రవర్తి న్యాయవాది సతీష్ మనేషిందే, శామ్యూల్ మిరాండాకు న్యాయవాది అయిన సుబోధ్ దేశాయ్, న్యాయవాది తారక్ సయ్యద్ అబ్దుల్ బాసిత్ పరిహార్ తరఫున హాజరయ్యారు మరియు దీపేశ్ సావంత్ న్యాయవాది రాజేష్ రాథోడ్ తన వాదనలు వినిపించారు.
ఎన్సీబీ విచారణలో బాలీవుడ్ ప్రముఖుల పేర్లు .. లోతుగా దర్యాప్తు
నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణ కేసుకు సంబంధించిన మనీ ట్రయిల్పై దర్యాప్తు చేస్తున్న ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుండి అందిన సమాచారం మేరకు ఎన్సిబి డ్రగ్స్ కేసుపై దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో, డ్రగ్స్ వినియోగం, సేకరణ, వాడకం మరియు రవాణాకు సంబంధించిన వివిధ చాట్లతో సహా అనేక కీలక అంశాలు వెల్లడి కావటంతో ఈ కేసులో బాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులను విచారిస్తుంది ఎన్సీబీ . సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో లింక్ అయిన డ్రగ్స్ కేసు అటు బాలీవుడ్ ను ఇటు టాలీవుడ్ ను కూడా షేక్ చేస్తుంది .