ఇదేం విడ్డూరం: రిక్షావాలాకు రూ.18వేలు జరిమానా... ఏంచేశాడో తెలుసా..?
న్యూఢిల్లీ: కేంద్రం తీసుకొచ్చిన కొత్త మోటార్ వెహికల్ చట్టం సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే పలు చోట్ల ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీగా జరిమానా విధించారు పోలీసులు. కొన్ని చోట్ల అయితే జరిమనాలు ఏకంగా లక్షల్లోనే ఉన్నాయి. ఓ వ్యక్తికి వేసిన జరిమానాతో షాకై ఏకంగా తన బైకునే కాల్చివేశాడు. మరో ఘటనలో ఓ లారీ డ్రైవర్కు లక్షల్లో జరిమానా విధించారు. ఇలా ప్రతిరోజు జరిమానాలపై ఏదో ఒక వార్త వింటూనే ఉన్నాం చూస్తూనే ఉన్నాం.
తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్లో జరిమానా విధింపుపై ఓ రిక్షావాలా బాధితుడిగా మారాడు. అహ్మదాబాదులో తన రిక్షాలో వెళుతుండగా ట్రాఫిక్ పోలీసులు రూ.18వేలు జరిమానా విధించారు. ట్రాఫిక్ పోలీసులు విధించిన భారీ జరిమానా కట్టలేక ఆ రిక్షావాలా ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయ్నానికి పాల్పడ్డాడు. బాధితుడిని రాజు సోలంకిగా గుర్తించారు. ఫినాయిల్ తాగిన రాజు సోలంకిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం అతను ప్రమాదం నుంచి బయటపడినట్లు సమాచారం.
రాజు సోలంకికి రూ.18వేలు జరిమానా విధించడంతోనే అది కట్టేందుకు తన ఆర్థిక పరిస్థితి సహకరించలేదని, అందుకే ఆత్మహత్యకు పాల్పడ్డారని వెల్లడించారు. అంతేకాదు విధించిన జరిమానా కట్టకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు రిక్షాను కూడా తీసుకెళ్లారు. రిక్షా నడుపుకుంటూ దాంతో వచ్చే డబ్బుతోనే కుటుంబాన్ని పోషిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఆ రిక్షానే తీసుకెళితే తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉంటే రాజు బీకామ్ చదివినట్లు చెప్పాడు. అయితే ఉద్యోగం రాకపోవడంతో తాను రిక్షాను నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నట్లు చెప్పాడు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీకి చెందిన రాకేష్ అనే వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడటంతో ఆయనకు రూ.16వేలు జరిమానా విధించారు. హెల్మెట్ ధరించలేదని, అవసరమైన డాక్యుమెంట్లు తన దగ్గర లేవని చెబుతూ ఈ జరిమానా విధించారు. దీంతో ఆగ్రహంకు గురైన రాకేష్ తన బైకును కాల్చివేశాడు.