మత మార్పిళ్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం- సుప్రీంకోర్టుకు నివేదిక
న్యూఢిల్లీ: మత మార్పిళ్లపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. తన అభిప్రాయం ఏమిటో తెలియజేసింది. ఈ మేరకు దేశ అత్యున్నత న్యాయస్థానానికి నివేదికను అందించింది. ఈ మధ్యకాలంలో కొన్ని రాష్ట్రాలు మత మార్పిళ్లను నియంత్రించడానికి తీసుకొచ్చిన చట్టాలపై కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వివరణ ఇచ్చింది. ఆయా రాష్ట్రాలు ఈ తరహా చట్టాలను ఎందుకు తీసుకొచ్చాయనే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
అమరావతిలో మాత్రమే రాజధాని ఉండాలా? - కోర్టులు..టౌన్ ప్లానింగ్ ఆఫీసులా: సుప్రీం సూటి ప్రశ్నలు
మత మార్పిళ్లకు వ్యతిరేకంగా..
దేశంలో మత మార్పిళ్లకు వ్యతిరేకంగా దాఖలైన పిటీషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. సీనియర్ అడ్వొకేట్ అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటీషన్ ఇది. ఆర్టికల్ 14, 21, 25 ప్రకారం..బలవంతపు మత మార్పిళ్లను నిషేధించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మత మార్పిళ్లను నిషేధించకపోతే దేశంలో హిందువులు త్వరలో మైనారిటీలుగా మారొచ్చంటూ ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఇదివరకే కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపించింది. తన అభిప్రాయాన్ని తెలియజేయాలని సూచించింది. దీనికి అనుగుణంగా ఇవ్వాళ కేంద్రం తన అభిప్రాయాన్ని తెలిపింది. ఈ మేరకు ఓ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించింది. ఇందులో పలు కీలక అంశాలను పొందుపరిచింది.
కఠిన చర్యలు..
మత స్వేచ్ఛ హక్కు 2021 చట్టాన్ని కర్ణాటక ప్రభుత్వం ఆమోదించింది. దీని ప్రధాన ఉద్దేశం మత మార్పిళ్ల నియంత్రణ. మత మార్పిళ్లను నియంత్రించాలనే ఉద్దేశంతో ఇంకొన్ని రాష్ట్రాలు కూడా ఇదే తరహా చట్టాలను అమలులోకి తీసుకొచ్చాయి. కర్ణాటకతో పాటు ఒడిశా, మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, హర్యానా ఈ చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేస్తోన్నాయి. మ మార్పిళ్లకు పాల్పడే వారిపై ఈ చట్టం కింద చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశాయి.
బలవంతపు మత మార్పిళ్లపై..
బలవంతంగా లేదా మోసపూరితంగా ఒక మతం నుంచి మరొక మతంలోకి మార్చడాన్ని ఈ చట్టం నిషేధిస్తుంది. మతం మార్చాలనే ఉద్దేశంతో జరిగిన వివాహాలు కూడా చెల్లదని స్పష్టం చేస్తుందీ యాక్ట్. గతంలో లవ్ జిహాద్ నియంత్రించడానికి ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఇదే తరహా చట్టాన్ని అమలులోకి తీసుకొచ్చింది. కొద్దిరోజుల కిందటే ఉత్తరాఖండ్ కూడా దీన్ని ప్రవేశపెట్టింది. లవ్ జిహాద్ను పూర్తిగా అరికట్టడానికి ఈ చట్టాన్ని అమలు చేయనున్నట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం స్పష్టం చేసింది.
పలు రాష్ట్రాల్లో..
మతమార్పిళ్లను నియంత్రిస్తూ 1967లోనే ఒడిశా ఫ్రీడం ఆఫ్ రిలీజియన్ యాక్ట్ను అమల్లోకి తీసుకొచ్చింది. ఈ తరహా చట్టాన్ని తీసుకొచ్చిన తొలి రాష్ట్రం కూడా అదే. మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ కూడా ఇలాంటి చట్టాలనే ప్రవేశపెట్టాయి. ఆర్థిక, సామాజిక రంగాల్లో వెనుకబడిన తరగతులు, సమాజంలోని బలహీన వర్గాల, మహిళల హక్కులను రక్షించడానికి ఇలాంటి చట్టాలు అవసరం అనేది ఆయా రాష్ట్రాల అభిప్రాయం.
ఆ హక్కు ఉండదు..
ఇవ్వాళ కేంద్ర ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు ఇదే విషయాన్ని తెలియజేసింది. మతస్వేచ్ఛ హక్కు దుర్వినియోగమౌతోందని పేర్కొంది. మోసపూరితం, బలవంతంగా మత మార్పిళ్లు జరుగుతున్నాయనే విషయం తమ దృష్టికి వచ్చిందని వివరించింది. డబ్బు, ఇతర ప్రలోభాలు, ఇతర మార్గాల ద్వారా ఒక వ్యక్తిని ఒక మతం నుంచి మరో మతానికి మార్పించే హక్కు ఖచ్చితంగా ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దీనిపై సుప్రీంకోర్టుకు ఓ నివేదికను అందజేసింది.