ఢిల్లీలోని పాకిస్తాన్ ఎయిర్ లైన్స్ ఆఫీస్ పైన దాడి
ఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ కన్నాట్ ప్రాంతంలోని నారాయణ్ మంజిల్లో ఉన్న పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్ లైన్స్ కార్యాలయం పైన గురువారం నాడు దాడి జరిగింది. ఈ దాడి కొందరు హిందూసేన కార్యకర్తలు చేసినట్లుగా చెబుతున్నారు.
భారత దేశం పైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడులను నిరసిస్తూ వారు దాడి చేసినట్లుగా తెలుస్తోంది. ఎయిర్ లైన్స్ కార్యాలయం పైన దాడి చేసిన ఆందోళనకారులు... పాక్ ప్రేరేపిత ఉగ్రవాదదాడులను నిరసిస్తున్నామంటూ నినాదాలు చేశారు.
ఎయిర్ లైన్స్ కార్యాలయంలోని ఫర్నీచర్ను వారు ధ్వంసం చేశారని సమాచారం. విషయం తెలిసిన పోలీసులు.. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళనకారులను చెదరగొట్టి పరిస్థతిని అదుపులోకి తీసుకు వచ్చారు.
ఈ దాడిలో అయిదారుగురు పాల్గొన్నట్లుగా తెలుస్తోంది. పఠాన్ కోట్ పైన ఇటీవల పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాదులు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఏడుగురు జవాన్లు అమరులయ్యారు. దీనిని యావత్ భారత్ ఖండించింది. పఠాన్ కోట్ దాడి నేపథ్యంలోనే పాక్ ఎయిర్ లైన్స్ కార్యాలయంపై దాడి జరిగింది.