షాకింగ్: ‘దంగల్’ సోదరి రితికా ఫోగాట్ ఆత్మహత్య -స్వల్ప తేడాతో ఫైనల్ ఓటమిని భరించలేక..
జీవితంలో గెలుపు తప్ప మరో దారి లేదని బోధించే ఉపదేశాలకు మరో భావి ధృవతార జీవితం బలైపోయింది. అక్కల్లాగే తానూ అంతర్జాతీయ ఖ్యాతిని సాధించాలనుకున్న ఆ చిన్నారి అనూహ్య రీతిలో ప్రాణాలు కోల్పోయింది. టోర్నమెంట్ ఫైనల్స్ లో ఓటమిని భరించలేక బలవన్మరణానికి పాల్పడింది. గురువారం తెల్లవారుతూనే క్రీడాలోకాన్ని షాకింగ్ కు గురిచేసిందీ వార్త..
రితికా ఫోగాట్ ఆత్మహత్య
యువ రెజ్లర్ రితికా ఫోగాట్ ఆత్మహత్య ఉదంతం కలకలం రేపుతున్నది. 'దంగల్ సిస్టర్స్'గా ప్రాచుర్యం పొందిన ప్రముఖ మహిళా రెజ్లర్లు గీతా ఫోగాట్, బబితా ఫోగాట్ల కిజిన్ సిస్టరైన రితికా.. ఓ రెజ్లింగ్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ అనంతరం బలవన్మరణానికి పాల్పడింది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో దంగల్ కోచ్ మహావీర్ సింగ్ ఫొగట్ కూడా అక్కడే ఉన్నారని తెలుస్తోంది. చనిపోయిన రితికా ఫోగాట్ వయసు కేవలం 17ఏళ్లే..
తెలంగాణలో మరో కొత్త పార్టీ! -కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ప్రకటన -కారు, కమలానికి దీటుగా?
ఫైనల్స్ ఓటమిని భరించలేక..
17 ఏళ్ల రితికా ఫోగట్ గడిచిన ఐదేళ్లుగా హర్యానాలోని మహావీర్ ఫోగట్ రెజ్లింగ్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. గీతా, బబితలకు ట్రైనింగ్ ఇచ్చిన 'ద్రోణాచార్య' అవార్డీ మహావీర్ ఫోగాటే రితికాకు కూడా శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్, జూనియర్ విమెన్ విభాగాల్లో రితికా ఇప్పుడిప్పుడే రాణిస్తుస్తోంది. తాజాగా భరత్పూర్(రాజస్థాన్)లోని లోహ్ఘర్ స్టేడియంలో మార్చి 12 నుంచి 14 వరకు జరిగిన రాష్ట్ర స్థాయి రెజ్లింగ్ పోటీల్లో ఆమె పాల్గొంది. టోర్నమెంట్ ఆసాంతం అద్భుతంగా ఆడిన రితికా.. మార్చి 14న జరిగిన ఫైనల్ మ్యాచ్లో మాత్రం కేవలం ఒక్క పాయింట్ తేడాతో ఓటమిని చవిచూసింది. దీంతో..
ఇంట్లో ఉరేసుకుని..
ఫైనల్ మ్యాచ్ లో స్పల్ప తేడాతో ఓడిపోవడంతో రితికా ఫోగాట్ తీవ్ర నిరాశకు గురైంది. భరత్ పూర్ నుంచి తిరిగొచ్చేసిన మరుసటి రోజే తన సొంత గ్రామమైన బాలాలిలో మార్చి 15న ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహానికి ఆస్పత్రిలో పంచనామా నిర్వహించి, కుటుంబసభ్యులకు తిరిగి అప్పగించారు. మార్చి 16నే రితికా అంత్యక్రియలు పూర్తయ్యాయి. ప్రాధమికంగా ఆత్మహత్యగా భావిస్తోన్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. కాగా,
కోచ్ భరోసా ఇచ్చినా...
రితికా ఆత్మహత్య విషయమై ఆమె సోదరుడు హర్వింద్ర ఫోగాట్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర స్థాయి కుస్తీ పోటీల్లో ఓడిపోవడం పెద్ద విషయమేమి కాదని, మ్యాచ్ జరుగుతోన్న సమయంలో కోచ్ మహావీర్(రితికా పెదనాన్న), తండ్రి మెన్పాల్ కూడా అక్కడ ఉన్నారని, ఓటమి తర్వాత రితికతో మాట్లాడిన మహావీర్ ఆమెకు భరోసా కూడా ఇచ్చారని, చివరికి రితికా ఇంత తీవ్ర నిర్ణయం తీసుకుంటుందని ఎవరూ ఊహించలేదని హర్వింద్ర అన్నారు.