Bihar polls: ప్రతీ ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం-తేజస్వీ సంచలన హామీ..!
బీహార్ లో ఈసారి గెలుపు కోసం సర్వశక్తులొడ్డుతున్న ఇండియా కూటమి స్థానిక సమస్యలను బట్టి హామీలు కూడా ఇస్తోంది. ఇందులో భాగంగా బీహార్ లో నిరుద్యోగ యువతను దృష్టిలో ఉంచుకుని విపక్ష రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్జేడీ) నేత తేజస్వీ యాదవ్ ఇవాళ ఓటర్లకు ఓ సంచలన హామీ ఇచ్చారు. విపక్ష కూటమిని గెలిపిస్తే రాష్ట్రంలో ప్రతీ కుటుంబానికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఈ హామీ చర్చనీయాంశంగా మారింది.
ఎన్నికల్లో గెలిపిస్తే భారీ ఎత్తున ఉద్యోగాల కల్పన చేస్తామని రాజకీయ పార్టీలు హామీ ఇస్తుంటాయి. కానీ ఇందుకు భిన్నంగా తమను గెలిపిస్తే ఏకంగా ప్రభుత్వ ఉద్యోగాలే కల్పిస్తామని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఇవాళ ప్రకటించారు. ఇందుకోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన 20 రోజుల్లోనే అసెంబ్లీలో చట్టం చేస్తామని కూడా వెల్లడించారు. అలాగే 20 నెలల్లో బీహార్లో ఏ ఇల్లూ కూడా ప్రభుత్వ ఉద్యోగం లేకుండా ఉండదన్నారు. దీంతో బీహార్ ఎన్నికల్లో ఈ హామీ నిరుద్యోగ యువతను కచ్చితంగా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు.

బీహార్ను ఎలా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నామో చాలా మంది తెలుసుకోవాలనుకున్నారని తేజస్వీ తెలిపారు. 20 ఏళ్లుగా ఈ విధ్వంస ప్రభుత్వం నిరుద్యోగం అతిపెద్ద సమస్య అని ఎప్పుడూ గ్రహించలేదని నితీష్ సర్కార్ ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఎన్డీయే భాగస్వాములు జేడీయూ, బీజేపీ ఉద్యోగాలను హామీ ఇవ్వడం లేదని, నిరుద్యోగ భృతిని హామీ ఇస్తున్నాయి అని తేజస్వీ గుర్తుచేశారు. బీహార్ ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. సామాజిక న్యాయంతో పాటు, బీహార్ ప్రజలకు ఆర్థిక న్యాయం కూడా చేస్తామన్నారు.

బీహార్ లో ప్రతీ ఇంటికీ ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నది తమ హామీ అని, ఇది కచ్చితంగా అమలు చేసి తీరుతామని తేజస్వీ యాదవ్ ప్రకటించారు. ఇది ఎన్డీయే తరహాలో మోసం కాదన్నారు. బీహార్లో ఇప్పటికే యువతకు నిరుద్యోగ భృతి హామీ ఇచ్చిన ఎన్డీయే కూటమికి తేజస్వీ ప్రకటన మింగుడు పడటం లేదు.












Click it and Unblock the Notifications