పన్నీరుసెల్వం వర్గం శవపేటిక ప్రచారం: 'జయలలితను అవమానించడమే'
చెన్నై: ఆర్కే నగర్ ఉప ఎన్నికలు తమిళ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ముఖ్యంగా ప్రతిపక్ష డీఎంకేతో పాటు చీలిపోయిన అన్నాడీఎంకేలోని శశికళ వర్గం, పన్నీరు సెల్వం వర్గం, దీపా జయకుమార్లు హోరాహోరీగా ప్రచారం చేస్తున్నాయి.

పన్నీరుసెల్వం కొత్త తరహా ప్రచారం
ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గం కొత్త తరహా ప్రచారం ప్రారంభించింది. ఉప ఎన్నికల ప్రచారం కోసం తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రతిమ ఉన్న శవపేటిక నమూనాను వినియోగించడం కలకలానికి దారి తీసింది.

ఓపెన్ టాప్ జీపుపై..
జయ మరణంపై దర్యాప్తు చేయించాలన్న డిమాండ్ను వెలిబుచ్చే విధంగా పన్నీరుసెల్వం వర్గీయులు ఈ నమూనాను ఓపెన్ టాప్ జీపు ముందు భాగంపై ఉంచి తమ అభ్యర్థి మధుసూదనన్ తరఫున ప్రచారానికి వెళ్లారు.

మధుసూదనన్ గెలిస్తే..
మధుసూదన్ గెలిస్తే జయలలిత మృతిపై దర్యాప్తు చేయించాలన్న డిమాండ్కు బలం చేకూరుతుందని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. అన్నాడీఎంకే (అమ్మ) వర్గీయులు ఈ చర్యపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసన తెలపడంతో పన్నీరుసెల్వం వర్గీయులు ఆ నమూనాను ఉపసంహరించుకున్నారు.
పన్నీరుసెల్వం వర్గంపై చర్యలు తీసుకోవాలని అన్నాడీఎంకే (అమ్మ) వర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసింది. నీచ రాజకీయాలకు పాల్పడుతున్నారని నినాదాలు చేసింది.

అమ్మను అవమానించడమే
దీనిపై అన్నాడీఎంకే అమ్మ పార్టీ అభ్యర్థి టీటీవీ దినకరన్ మాట్లాడారు. జయలలిత ప్రతిమ ఉన్న శవపేటిక నమూనాను ఉపయోగించడం సరికాదని, ఓట్ల కోసం అలా చేస్తున్నారని పన్నీరుసెల్వం వర్గీయులపై మండిపడ్డారు. ఇది జయలలితను అవమానించడమేనని అభిప్రాయపడ్డారు.












Click it and Unblock the Notifications