అరుణాచల్ప్రదేశ్ మాజీ సీఎం(47) ఆత్మహత్య
ఈటానగర్: అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కలిఖో పుల్(47) ఆత్మహత్యకు పాల్పడ్డారు. కాంగ్రెస్ పార్టీ రెబల్ ఎమ్మెల్యేలు, బిజెపి సాయంతో ఆయన అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి అయ్యారు. 145 రోజులపాటు ఆయన ముఖ్యమంత్రి పదవిలో కొనసాగారు.
అనంతరం సుప్రీం ఆదేశాలతో ఆయన ముఖ్యమంత్రి పదవిని గత నెల జులైలో కోల్పోయారు. ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఈ నేపథ్యంలో ఆయన మంగళవారం ఉదయం తన నివాసంలోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం.
1995లో తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన కలిఖో పుల్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో అంచెలంచెలుగా ఎదిగారు. కాగా, అరుణాచల్ ప్రదేశ్లో రాజకీయాల్లో ఇటీవల పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అరుణాచల్లో రాష్ట్రపతి పాలన అనంతరం పుల్ నాలుగు నెలలు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
అప్పుడు అనాథగా ఆత్మహత్యాయత్నం: ఇప్పుడు సీఎం అయ్యారు
ఆ తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో పుల్ సీఎం పదవిని కోల్పోయారు. పుల్ కొద్ది రోజుల్లోనే సీఎం పదవిని కోల్పోవడంతో తీవ్ర మనోవేదనకు గురయ్యారు. ఈ నేపథ్యంలో.. కలికో పుల్ ఇటానగర్లోని తన అధికారిక నివాసంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. సొంత నివాసంలో మరమ్మతులు చేయిస్తున్నందున పుల్ ఇంకా అధికారిక నివాసం ఖాళీ చేయలేదు.
కాంగ్రెస్ పార్టీకి చెందిన పుల్ రెబల్గా మారి 21 మంది ఎమ్మెల్యేలతో కలిసి పార్టీ ఫిరాయించారు. దీంతో నబమ్ టుకి ప్రభుత్వం రద్దైంది. 2015 డిసెంబరు 9న ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం కేంద్రం ఆమోదంతో రెబల్ ఎమ్మెల్యేలు, బిజెపి ఎమ్మెల్యేలతో కలిసి కలికోపుల్ 2016 ఫిబ్రవరి 19న అరుణాచల్ ప్రదేశ్ ఎనిమిదో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. దీంతో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
దీంతో రాష్ట్రంలో తిరిగి నబమ్ టుకి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలని సుప్రీం ఆదేశించింది. ఈ క్రమంలో కలికో పుల్ పదవి నుంచి దిగిపోవాల్సి వచ్చింది. అయితే బలపరీక్షకు ముందే టుకి రాజీనామా చేశారు. తర్వాత జరిగిన నాటకీయ పరిణామాలతో రెబల్ నేతలు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పెమా ఖందూ అరుణాచల్ సీఎంగా ఎన్నికయ్యారు.