విలేకరిపై సోనియా అల్లుడు వాద్రా చిందులు (పిక్చర్స్)
న్యూఢిల్లీ: ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు రాబర్డ్ వాద్రా విలేకరి పైన చిందులు తొక్కారు. హర్యానాలో ఆయన పైన వెల్లువెత్తిన ఆరోపణలకు సంబంధించి ఓ విలేకరి అడిగిన ప్రశ్నలకు రాబర్ట్ వాద్రా ఆగ్రహోదగ్రుడయ్యారు. న్యూఢిల్లీలోని అశోకా హోటల్లో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
తనపై ప్రశ్నలు సంధించిన విలేకరిపై వాద్రా దురుసుగా ప్రవర్తించడమే కాక మైకును లాగి పడేశారు. రాబర్డ్ వాద్రా తీరు సోనియా గాంధీని, కాంగ్రెస్ పార్టీని కొత్త వివాదంలోకి లాగినట్లయింది.
హర్యానాలో గద్దెనెక్కిన బీజేపీ ప్రభుత్వం, వాద్రా భూముల కేటాయింపులను రద్దు చేసేందుకు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇదే విషయంపై ఓ విలేకరి వాద్రా స్పందనను కోరారు. అయితే అప్పటిదాకా బాగానే ఉన్న వాద్రా, ఆ ప్రశ్నతో ఒక్కసారిగా కోపగించుకునన్నారు.
సీరియస్గానే ఆ ప్రశ్న అడుగుతున్నావా?, సీరియస్గానేనా అంటూవిలేకరిని ఎదురు ప్రశ్నించారు. ముందు నీ కెమెరాను బంద్ చెయ్యమంటూ మైక్రోఫోన్ను వాద్రా పక్కకు నెట్టేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో ఫుటేజీలు శనివారం రాత్రి నెట్లో హల్చల్ చేశాయి.
ఈ విషయమై వాద్రా అనంతరం స్పందించారు. తనను ఓ ప్రయివేటు ఫోటోగ్రాఫర్ ప్రశ్నిస్తున్నారనుకున్నానని చెప్పారు. ఇదే విషయమై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా మాట్లాడుతూ.. వాద్రా రియాక్ట్ అయిన తీరు చూసి తాను షాక్ అయ్యానని, తన తీరుకు ఆయన దేశానికి, మీడియాకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. విలేకరులు ప్రశ్నించినప్పుడు సమాధానం చెప్పడానికి ఇబ్బంది అనిపిస్తే నో కామెంట్ అంటే సరిపోతుందని వ్యాఖ్యానించారు.
<center><iframe width="100%" height="360" src="//www.youtube.com/embed/PI2V40M_rHg?feature=player_embedded" frameborder="0" allowfullscreen></iframe></center>
రాబర్ట్ వాద్రా హర్యానా భూదందాతో రూ.44 కోట్ల మేర ఆయాచిత లబ్ధి పొందారని భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నిగ్గు తేల్చింది. భూపిందర్ సింగ్ హుడా ప్రభుత్వ సంపూర్ణ సహకారంతో చక్రం తిప్పిన వాద్రా అతి స్వల్ప కాలంలోనే అత్యధిక మొత్తంలో లాభాలు జేబులో వేసుకున్నారని కాగ్ నివేదిక తేల్చింది.