వాద్రాను పాపి అనడం సరికాదు: వ్యాజ్యం కొట్టేసిన సుప్రీం
న్యూఢిల్లీ: యూపిఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, వారి కుటుంబ సభ్యులు సుప్రీంకోర్టు తీర్పు ఊరట పొందారు. సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రాకి చెందిన కంపెనీకి సంబంధించి భూముల లావాదేవీలపై సిబిఐ విచారణ జరిపించాలని కోరుతూ సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని న్యాయస్థానం సోమవారం కొట్టివేసింది.
న్యాయవాది ఎంఎల్ శర్మ దాఖలు చేసిన పిటిషన్ను న్యాయమూర్తులు హెచ్ఎల్ దత్తు, రంజన్ గోగొయ్ లతో కూడిన ధర్నాసనం తోసిపుచ్చింది. రాబర్ట్ వాద్రాను పాపి అని సంబోధించడం సరికాదని బెంచ్ పేర్కొంది. పిటిషన్ ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని ఉండకూడదని, ఇది వ్యక్తి ప్రతిష్టను దిగజార్చేలా ఉందని, ఇదొక చవకబారు ప్రచారమని ఉన్నత న్యాయస్థానం పేర్కొంది.
పిటిషన్లో రాజకీయ నాయకులతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి పేరును ధ్వంసం చేసేలా ఉందని, వాద్రాను ఒక పాపిలా పేర్కొనడం సరికాదని కోర్టు తన తీర్పులో తెలిపింది. పిటిషన్ను ఉపసంహరించుకునేందుకు పిటిషనర్ శర్మకు కోర్టు అనుమతించింది.
గతంలో రాబర్ట్ వాద్రా హర్యానాలోని గుర్గావ్లో 3.5 ఎకరాల భూమిని బూటకపు ఒప్పందాలతో కైవసం చేసుకున్నాడని ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా ఆరోపించిన విషయం తెలిసిందె. అంతేగాక వాద్రా, డిఎల్ఎఫ్ మధ్య జరిగిన ఒప్పందంపై విచారణకు కూడా ఆయన ఆదేశించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన హర్యానా ప్రభుత్వం గోధుమ గింజల అమ్మకంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని అశోక్ ఖేమ్కాపై రెండు ఛార్జీషీట్లను దాఖలు చేసింది. ఆ తర్వాత ప్రభుత్వానికి ఖేమ్కా ఒక బహిరంగ లేఖలో తనపై వచ్చిన ఆరోపణలకు వివరణ ఇచ్చారు.