దేశంలో తొలిసారి: ప్రభుత్వ పాఠశాలలో ‘రోబోటిక్ ల్యాబ్’
గుర్గావ్: దేశంలోని తొలిసారిగా ఓ ప్రభుత్వ పాఠశాలలో రోబోటిక్ ల్యాబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. 'ఇండియా స్టెమ్ ఫౌండేషన్' అనే సంస్థ గుర్గావ్లోని జవహర్ నవోదయ విద్యాలయ ప్రభుత్వ పాఠశాలలో దేశంలోనే మొదటి 'రోబోటిక్స్ ల్యాబ్'ను ఏర్పాటు చేసింది. 'రోబో శిక్షా కేంద్ర'గా పిలవబడుతున్న ఈ ల్యాబ్లో కంప్యూటర్ సిస్టమ్స్, కంట్రోల్స్, సెన్సరీ ఫీడ్బ్యాక్, ఇన్ఫర్మేషన్ ప్రాసెసింగ్ వంటి అంశాల్లో విద్యార్థులకు శిక్షణ అందించనున్నారు.
'మేక్ ఇన్ ఇండియా', 'స్కిల్ ఇండియా' కార్యక్రమాల్లో భాగంగా దాదాపుగా రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు నిధులను వెచ్చించి ఈ రోబోటిక్స్ ల్యాబ్ను ఏర్పాటు చేసినట్టు ఇండియా స్టెమ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సుధాన్షు శర్మ వెల్లడించారు. దేశంలో కేవలం కొన్ని పేరుగాంచిన ప్రైవేటు పాఠశాలల్లో మాత్రమే ఈ తరహా ల్యాబ్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
భారత్లో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నడిచే ప్రభుత్వ పాఠశాలల్లో 'జవహర్ నవోదయ విద్యాలయల'కు ప్రత్యేక గుర్తింపు ఉందని, ఈ క్రమంలోనే కార్పొరేట్ సామాజిక బాధ్యతగా తొలుత ఈ పాఠశాలలో రోబోటిక్స్ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఈ తరహా ల్యాబ్ దేశంలోనే మొదటిది కాగా, ఇందులో శిక్షణ పొందే విద్యార్థులకు రోబోటిక్స్ పాఠాలను నేర్పించేలా పాఠశాల ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు.
ఈ ల్యాబ్ను వాడుకున్నందుకు విద్యార్థులు ఎటువంటి ప్రత్యేక రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. త్వరలోనే శాంసంగ్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని స్మార్ట్క్లాస్ల ద్వారా విద్యాబోధన అందించేందుకు కృషి చేయనున్నారు.
గత సెప్టెంబర్ నెలలో జరిగిన 'ఇండియన్ రోబోటిక్ ఒలంపియాడ్(ఐఆర్వో)'లో గుర్గావ్ జవహర్ నవోదయ విద్యాలయకు చెందిన పలువురు విద్యార్థులు పాల్గొన్నారు. వారు విజేతలుగా నిలవకపోయినా ఆశించిన స్థాయిలో తమ సత్తా చాటారని, రాబోయే ఏడాది మరింత మెరుగ్గా ఫలితాలను సాధిస్తారని పాఠశాల అధ్యాపకులు ఆకాంక్షించారు.