వాళ్లు చాలా డేంజర్.. పంపించేయాల్సిందే, ఇది మా విధాన నిర్ణయం.. మీ జోక్యం వద్దు: కేంద్రం
రోహింగ్యా శరణార్థులలో కొంతమందికి లష్కరే, ఇస్లామిక్ స్టేట్లాంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని, అందుకే వారిని భారత్ నుంచి పంపించేయాలని భావిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: రోహింగ్యా శరణార్థులలో కొంతమందికి లష్కరే, ఇస్లామిక్ స్టేట్లాంటి ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయని, అందుకే వారిని భారత్ నుంచి పంపించేయాలని భావిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.
అంతేకాదు, ఇది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయమని, ఇందులో సుప్రీంకోర్టు జోక్యం చేసుకోరాదని కూడా కోరింది. రోహింగ్యా ముస్లింల కేసుకు సంబంధించి సుప్రీంకోర్టులో సోమవారం కేంద్రం ఓ అఫిడవిట్ దాఖలు చేసింది.

సుమారు 40 వేల మంది రోహింగ్యాలు ఇండియా, మయన్మార్ సరిహద్దులో ఉన్న అక్రమ మార్గాల ద్వారా దేశంలోకి చొరబడ్డారని చెప్పింది. ఇంకా వస్తూనే ఉన్నారని, వాళ్లందరికీ ఇక్కడ ఆశ్రయమిస్తే దేశ భద్రతకు తీవ్ర ముప్పు వాటిల్లుతుందని వెల్లడించింది.
పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో రోహింగ్యాల్లోని కొందరికి సంబంధాలు ఉన్నట్లు కేంద్రానికి ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం ఉన్నదని తెలిపింది. ఇప్పటికే కొందరు రోహింగ్యాలు జాతి వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేందుకు హవాలా మార్గంలో నిధులు సమీకరించే పనిలో ఉన్నారని కోర్టుకు స్పష్టంచేసింది.
మనుషుల అక్రమ రవాణా, ఇతర రోహింగ్యాలకు కూడా నకిలీ గుర్తింపు పత్రాలు సేకరించే పనిలో ఉన్నారని తెలిపింది. విధానపరమైన నిర్ణయాల్లో ప్రభుత్వానికి ఉన్న అత్యున్నత అధికారాలను దృష్టిలో ఉంచుకొని కోర్టు జోక్యం చేసుకోకుండా ఉంటే బాగుంటుందని అఫిడవిట్లో కేంద్రం స్పష్టంగా తెలిపింది.
అయితే తమను శరణార్ధులుగా భావించి దేశంలో ఉండనివ్వాలని రోహింగ్యా ముస్లిలు కోరారు. వారి తరఫున లాయర్లు నారీమన్, కపిల్ సిబాల్ వాదించారు. అయితే చట్టప్రకారమే న్యాయస్థానం ముందుకు వెళుతుందని న్యాయమూర్తి పేర్కొన్నారు. ప్రభుత్వ వాదనను విన్న సుప్రీంకోర్టు దీనిపై విచారణను అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications