మురళీమోహన్ సెక్సిస్ట్ వ్యాఖ్యలు: రాజ్యసభలో రభస
న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు మురళీ మోహన్ మహిళల వస్త్రధారణపై చేసిన వ్యాఖ్యలపై రాజ్యసభలో శుక్రవారం దుమారం చెలరేగింది. మహిళలకు క్షమాపణ చెప్పాలని ప్రతిపక్షాల సభ్యులు రాజ్యసభలో పట్టుబట్టారు. దీంతో రాజ్యసభలో గందరగోళం ఏర్పడింది.
సభ సద్దుమణగకపోవడంతో చైర్మన్ హమీద్ అన్సారీ సభను 15 నిమిషాల పాటు వాయిదా వేశారు మహిళలు హుందాతనం ఉట్టిపడే దుస్తులు ధరించాలని మురళీ మోహన్ గురువారం లోకసభలో అన్నారు. అప్పుడు ప్రతిపక్షాలకు చెందిన మహిళా ఎంపీల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.
మురళీ మోహన్ వ్యాఖ్యలపై బిజెపి సభ్యులు మౌనంగా ఉన్నప్పటికీ ఇతర పార్టీల సభ్యులు తీవ్ర అభ్యంతరం చెప్పారు. దేశంలో మహిళలు, పిల్లలపై జరుగుతున్న దారుణాలపై లోకసభలో చర్చ సందర్భంగా మురళీమోహన్ ఆ వ్యాఖ్యలు చేశారు.
రాసుకున్న ప్రసంగ ప్రతిని ఆయన చదివారు. భారత సంప్రదాయాలను కాపాడడానికి, హుందాగా దుస్తులు ధరించాలని తన సోదరీమణులను, కూతుళ్లను అమ్మాయిలను కోరుతున్నానని మురళీ మోహన్ అన్నారు. ఆయన వ్యాఖ్యలు మోరల్ పోలీసింగ్ అంటూ నిరసనలు వ్యక్తమయ్యాయి.