వామ్మో.. ఇంటికి రూ.3వేల కోట్ల కరెంట్ బిల్లు; దెబ్బకు ఆస్పత్రి పాలైన ఇంటిఓనర్... ఆపై
దేశ వ్యాప్తంగా విద్యుత్ ఛార్జీల మోత మోగుతోంది. మధ్యతరగతి కుటుంబీకులు విద్యుత్ బిల్లు వస్తోందంటే ఆందోళన పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. 2 వేల కరెంటు బిల్లు వస్తేనే దిగులు పడే మధ్యతరగతి వాసులు ఏకంగా 3 వేల కోట్ల రూపాయలకు పైగా కరెంట్ బిల్లు వచ్చింది అంటే ఏమైపోతారో ఒక్కసారి ఊహించొచ్చు. తాజాగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్లో అటువంటి సంఘటన చోటు చేసుకుంది.
3419 కోట్ల రూపాయల కరెంట్ బిల్లు, చూసి షాక్ తిని ఆస్పత్రి పాలైన వ్యక్తి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో నివాసముంటున్న శివా విహార్ కాలనీకి చెందిన ప్రియాంక గుప్తా ఇంటికి ఏకంగా 3419 కోట్ల రూపాయలు కరెంటు బిల్లు వచ్చింది. ఇక ఈ కరెంట్ బిల్లును చూసిన ఆమె మామగారు ఒక్కసారిగా షాక్ కు గురై తీవ్ర అస్వస్థతతో ఆస్పత్రి పాలయ్యారు. 3,419 కోట్ల రూపాయల విద్యుత్ బిల్లును అందుకోవడంతో ప్రియాంక గుప్త కుటుంబం దారుణంగా షాక్కు గురైంది.
జులై నెల కరెంట్ బిల్లు మూడు వేల కోట్లు పైగా.. మానవ తప్పిదం అన్న విద్యుత్ సంస్థ
జూలై నెల గృహ వినియోగానికి సంబంధించిన విద్యుత్ బిల్లులో మూడు వేల కోట్లకు పైగా బిల్ వేయడాన్ని చూసిన తన తండ్రి షాక్ కు గురయ్యారని, ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ప్రియాంక గుప్త భర్త సంజీవ్ కంకనే తెలిపారు. అయితే మధ్యప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలోని విద్యుత్ సంస్థ తాము ఇచ్చిన బిల్లు మానవ తప్పిదం వల్ల జరిగిందని పేర్కొంది. జూలై 20న విడుదల చేసిన బిల్లు మధ్యప్రదేశ్ మధ్య క్షేత్ర విద్యుత్ పంపిణీ కంపెనీ (MPMKVVC) పోర్టల్ ద్వారా క్రాస్ వెరిఫై చేసింది. అయితే అది సరైనది కాదని తేలింది.
1,300 రూపాయల కరెంట్ బిల్లు మళ్ళీ ఇచ్చిన విద్యుత్ సంస్థ
గ్వాలియర్ నగరంలోని శివ్ విహార్ కాలనీలో నివసించే ఆందోళన చెందుతున్న ప్రియాంకా గుప్తా కుటుంబానికి ఉపశమనం కలిగించేలా 1,300 రూపాయల సరిదిద్దిన మరో బిల్లును జారీ చేసింది. అంతేకాదు భారీ విద్యుత్ బిల్లుకు మానవ తప్పిదమే కారణమని, సంబంధిత ఉద్యోగులపై చర్యలు తీసుకున్నామని ఎంపీఎంకేవీవీసీ జనరల్ మేనేజర్ నితిన్ మాంగ్లిక్ తెలిపారు.
ఉద్యోగిపై చర్యలు తీసుకుంటున్నామన్న ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమ్న్ సింగ్ తోమర్
సాఫ్ట్వేర్లో వినియోగించే యూనిట్ల స్థానంలో ఒక ఉద్యోగి వినియోగదారు నంబర్ను నమోదు చేశారని ఫలితంగా ఎక్కువ మొత్తంతో బిల్లు వచ్చిందని తెలిపారు. సరిచేసిన 1,300 రూపాయల బిల్లు విద్యుత్ వినియోగదారుకు జారీ చేయబడింది అని ఆయన చెప్పారు. ఇక ఈ ఘటనపై స్పందించిన మంత్రి లోపాన్ని సరిదిద్దామని పేర్కొన్నారు. సంబంధిత ఉద్యోగిపై చర్యలు తీసుకుంటున్నామని ఎంపీ ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమ్న్ సింగ్ తోమర్ విలేకరులకు తెలిపారు.