ఆధునీకీకరణపైనే దృష్టి: రైల్వే ప్రయాణికులకు శుభవార్త
2017-18 సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ రూ.1.31 లక్షల కోట్లు ఉన్నట్లు జైట్లీ ప్రకటించారు.
న్యూఢిల్లీ: సుమారు 92 ఏళ్లుగా ఉన్న సాంప్రదాయానికి స్వస్తి చెప్పిన మోడీ ప్రభుత్వం.. రైల్వే బడ్జెట్ను సాధారణ బడ్జెట్లో కలిపేసింది. ప్రతిపక్షాల నుంచి అడ్డంకులు ఎదురైనా ముందుగా అనుకున్న ప్రకారం బుధవారం ఉదయం 11 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పార్లమెంటులో బడ్జెట్ను ప్రవేశపెట్టారు.
2017-18 సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్లో రైల్వే బడ్జెట్ రూ.1.31 లక్షల కోట్లు ఉన్నట్లు జైట్లీ ప్రకటించారు. రైల్వేలకు ప్రభుత్వం నుంచి రూ. 55 వేల కోట్లు ఇస్తున్నట్లు ఆర్థిక మంత్రి చెప్పారు. ఐదేళ్లలో ప్రయాణికుల భద్రత కోసం రూ.లక్ష కోట్లను కేటాయించామని జైట్లీ పేర్కొన్నారు.
బడ్జెట్ 2017-18 పూర్తి వివరాలు
ఈ ఏడాది 3500 కి.మీ. మేర రైల్వే లైన్లను ఆధునీకరిస్తామని అరుణ్ జైట్లీ తెలిపారు. దేశవ్యాప్తంగా 70 ప్రాజెక్టులను గుర్తించామని, వాటిని అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి రాష్ట్రప్రభుత్వాలతో కలిసి పనిచేస్తామని ఆర్థికమంత్రి తెలియజేశారు.
తమ ప్రభుత్వ హయాంలో 500 రైల్వేస్టేషన్లను అప్గ్రేడ్ చేశామని, 2వేల రైల్వేస్టేషన్లలో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేశాం జైట్లీ సగర్వంగా ప్రకటించారు. రైల్వే బడ్జెట్లో ఈ సారి కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నామని, దానికి 'కోచ్ మిత్ర'గా నామకరణం చేశామని ఆయన తెలిపారు.
రైల్వే ప్రయాణికులక శుభవార్త
ప్రస్తుత పోటీ ప్రపంచంలో రైల్వేలకు కూడా ప్రైవేటు సెక్టార్ నుంచి పోటీ ఎక్కువైందని ఈ సందర్భంగా జైట్లీ చెప్పారు. వాటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు రైల్వేను మరింత దగ్గర చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, అందులో భాగంగా ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకున్నవారికి సర్వీస్ ఛార్జీలు రద్దు చేస్తున్నామని ప్రకటించి ప్రయాణికులకు శుభవార్త చెప్పారు.
ప్రయాణికుల భద్రతకు రైల్ సంరక్షా కోశ్ నిధులను ఐదేళ్లలో 1లక్ష కోట్లను కేటాయిస్తామని తెలిపారు. 2020నాటికి అన్ మ్యాన్డ్ రైల్వే గేట్లను పూర్తిగా తొలగిస్తామని చెప్పారు. 5500కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్లు వేస్తామని, పర్యటకం, పుణ్యక్షేత్రాల సందర్శనకు ప్రత్యేక రైళ్లు వేస్తామని చెప్పారు. 500 స్టేషన్లలో వికలాంగుల కోసం లిఫ్టులు, ఎస్కలేటర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు.
రైల్వేలకు ప్రయివేట్ సెక్టార్ నుంచి పోటీ ఎక్కువైందని చెప్పిన జైట్లీ.. మెట్రో రైల్వేలో ప్రైవేట్ సెక్టార్కు ప్రాధాన్యం ఉంటుందని చెప్పడం గమనార్హం. అయితే కొత్త మెట్రో రైల్ విధానాన్ని ప్రవేశపెడతామని ప్రకటించారు. దీని ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని జైట్లీ తెలిపారు.
2017-18 ఆర్థిక బడ్జెట్లో రైల్వేకు మోడీ ప్రభుత్వం కేటాయింపులు ఇవే...
1. ఐదు సంవత్సరాల కాల పరిమితితో లక్ష కోట్లతో రైల్వేకు ప్రత్యేక నిధి
2. ఐఆర్సీటీసీ ద్వారా టికెట్ బుక్ చేసుకునే వారికి సర్వీస్ చార్జ్ తొలగింపు
3. దేశవ్యాప్తంగా ఉన్న 5వందల రైల్వే స్టేషన్లలో లిఫ్ట్లు, ఎస్కలేటర్లు కల్పించేలా చర్యలు
4. కొన్ని రైళ్లను కేవలం పర్యాటక కేంద్రాలకు కేటాయించడం
5. కొత్త మెట్రో రైల్ విధానాన్ని ప్రవేశపెట్టారు. దీనివల్ల ఎంతో మంది యువతకు ఉద్యోగాల కల్పన
6. 2017-18 నాటికి కనీసం 25 రైల్వే స్టేషన్లను ఉత్తమంగా తీర్చిదిద్దేలా చర్యలు తీసుకోవడం
7. 2019 నాటికి అన్ని రైల్వే కోచ్ల్లో బయో టాయ్లెట్స్ను అందుబాటులోకి తేవడం
8. 2020 కల్లా అస్తవ్యస్థంగా ఉన్న రైల్వే క్రాసింగ్స్ వద్ద పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు
9. 22శాతం పెంపుతో రైల్వేకు బడ్జెట్లో నిధుల కేటాయింపు.