పాక్ కాల్పుల్లో ముగ్గురు మృతి, 16మందికి గాయాలు
శ్రీనగర్: పాకిస్థాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉలంఘిస్తూనే ఉంది. తాజాగా గురువారం అర్ధ రాత్రి నుంచి జమ్మూకాశ్మీర్లోని ఆర్ఎస్ పురా, ఆర్నియా సెక్టార్లో బిఎస్ఎఫ్ శిబిరాలే లక్ష్యంగా కాల్పులకు తెగపడింది.
ఆర్ఎస్ పురా సెక్టార్ వద్ద పాక్ కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా, 16మందికి గాయాలయ్యాయి. భారత జవాన్లు, పాక్ సైనికుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. దీంతో సరిహద్దు గ్రామాల్లోని ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు.
1965 యుద్ధ వీరులకు రాష్ట్రపతి నివాళి
1965లో భారత్-పాకిస్థాన్ల మధ్య జరిగిన యుద్ధానికి నేటితో 50 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆనాటి యుద్దంలో దేశం కోసం ప్రాణ త్యాగం చేసిన అమర జవాన్లకు నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా అమర జవాన్లకు నివాళులర్పించారు.
జమ్మూకాశ్మీర్లోకి పాకిస్థాన్ తన బలగాలను అక్రమంగా చొప్పించేందుకు చేసిన ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకు భారతదేశం ఏప్రిల్ 1965 నుంచి సెప్టెంబర్ 1965 మధ్య పాకిస్థాన్తో యుద్ధం చేసిన విషయం తెలిసిందే.
గుజరాత్లో కొనసాగుతున్న కర్ఫ్యూ
గుజరాత్లో రెండురోజులుగా చెలరేగిన హింస.. శుక్రవారం పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. అయితే, పరిస్థితి నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడు ఘర్షణలు చెలరేగుతాయో ఏమోనన్న ఆందోళనకర వాతావరణం నెలకొంది.
కాగా, ఆందోళనకారులకు పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల్లో మృతుల సంఖ్య 10కి చేరింది. అహ్మదాబాద్ సహా సూరత్, రాజ్కోట్, మెహసనా, పటాన్, పాలన్పూర్, విస్నగర్, జామ్నగర్ పట్టణాల్లో కర్ఫ్యూ కొనసాగుతోంది.