కిరణ్ బేడీ చేరికపై బీజేపీలో ఆగ్రహం, కేజ్రీ పార్టీలో ఉత్తేజం!: ఆరెస్సెస్
న్యూఢిల్లీ: మరో నాలుగు రోజుల్లో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఆశించిన స్థానాలు దక్కే అవకాశం కనిపించడం లేదనే వాదనలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. నిన్నటి వరకు బీజేపీకే అధికారం అని సర్వేలు బల్లగుద్ది చెప్పాయి. అయితే కిరణ్ బేడీ చేరిక తర్వాత అంతా తారుమారైందనే వాదనలు వినిపిస్తున్నాయి.
బీజేపీకి గట్టి మద్దతుదారు అయిన ఆరెస్సెస్ కూడా అదే విషయం చెబుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న బీజేపీ పరిస్థితి అంత ఆశాజనకంగా లేదని చెబుతోంది. కిరణ్ బేడీ చేరిక, ఆమెను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత బీజేపీకి కొంత వ్యతిరేకత వచ్చిందని ఆరెస్సెస్ నేత పేర్కొన్నారు.
ఆరెస్సెస్ మేగజైన్ ఢిల్లీ బ్యూరో ఓ ఆంగ్ల పత్రికలో ఆర్టికల్ రాశారు. కిరణ్ బేడీ చేరిక, సీఎం అభ్యర్థిగా ప్రకటన తర్వాత ఢిల్లీ బీజేపీ యూనిట్లో ఆగ్రహం కట్టలు తెంచుకుందని పేర్కొంది. అయితే, ఆ తర్వాత పార్టీ పరిస్థితి కొంత మెరుగుపడిందన్నారు.
కిరణ్ బేడీని సీఎం అభ్యర్థిగా ప్రకటించాక పరిస్థితి బాగా లేకుండెనని, అయితే, బీజేపీ అనూహ్యంగా ఎన్నికల వ్యూహాన్ని మార్చిందని, దీంతో మెరుగుపడిందన్నారు. అదే సమయంలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా తాము పుంజుకుంటున్నట్లుగా చెబుతోందన్నారు.