ఆపరేషన్ సిందూర్ పై ఆరెస్సెస్ ఛీఫ్ కీలక వ్యాఖ్యలు..!
పహల్గాం దాడికి కౌంటర్ గా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ పై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. ఆపరేషన్ సిందూర్ పై కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన ప్రశంసించారు. భారతదేశ భద్రతకు పాకిస్తాన్ లోపల దాడులు అనివార్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ మేరకు మోహన్ భగవత్ ఇవాళ ఓ ప్రకటన విడుదల చేశారు.
పహల్గామ్లో నిరాయుధులైన పర్యాటకులపై జరిగిన పిరికి దాడి తర్వాత పాక్ ప్రాయోజిత ఉగ్రవాదులు, వారికి మద్దతు ఇచ్చే వ్యవస్థపై తీసుకున్న నిర్ణయాత్మక చర్యకు కేంద్ర ప్రభుత్వ నాయకత్వాన్ని, సాయుధ దళాలను అభినందిస్తున్నట్లు భగవత్ తెలిపారు. హిందూ పర్యాటకులపై జరిగిన దారుణమైన హత్యాకాండలో బాధిత కుటుంబాలకు, మొత్తం దేశానికి న్యాయం చేయడానికి ఈ చర్య మొత్తం దేశం యొక్క ఆత్మగౌరవం, ధైర్యాన్ని పెంచిందన్నారు.

పాకిస్తాన్లో ఉగ్రవాదులు, వారి మౌలిక సదుపాయాలు, సహాయక వ్యవస్థలపై సైనిక చర్య తీసుకోవడం దేశ భద్రతకు అవసరం , అనివార్యమని తాము అంగీకరిస్తున్నట్లు భగవత్ తెలిపారు. జాతీయ సంక్షోభం ఉన్న ఈ సమయంలో మొత్తం దేశం ప్రభుత్వం, సాయుధ దళాలకు ఉత్సాహంగా అండగా నిలుస్తుందన్నారు. భారత్ సరిహద్దులోని మతపరమైన ప్రదేశాలు , పౌర నివాస ప్రాంతాలపై పాకిస్తాన్ సైన్యం చేస్తున్న దాడులను ఆర్ఎస్ఎస్ చీఫ్ ఖండించారు.
ఈ క్రూరమైన అమానవీయ దాడులలో బాధితుల కుటుంబాలకు భగవత్ హృదయపూర్వక సంతాపాన్ని తెలిపారు. ప్రభుత్వ సూచనలను పాటించాలని ఆయన పౌరులకు విజ్ఞప్తి చేశారు. మన పవిత్ర పౌర విధిని నిర్వర్తించేటప్పుడు, మనమందరం జాగ్రత్తగా ఉండాలని కోరారు. అలాగే సామాజిక ఐక్యత, సామరస్యాన్ని దెబ్బతీయడంలో దేశ వ్యతిరేక శక్తుల కుట్ర విజయవంతం కాకుండా చూసుకోవాలన్నారు.
ఇలాంటి సమయంలో పౌరులు తమ దేశభక్తిని ప్రదర్శించాలని భగవత్ కోరారు. సైన్యం, అధికారులతో సహకరించడానికి సిద్ధంగా ఉండాలని కోరారు. జాతీయ ఐక్యత, భద్రతను కాపాడుకోవడానికి అన్ని ప్రయత్నాలను బలోపేతం చేయాలన్నారు. మొత్తంగా పౌరులు పాకిస్తాన్ పై యుద్ధంలో కేంద్రానికి, ఆర్మీకి అండగా నిలవాలని ఆరెస్సెస్ ఛీఫ్ ప్రజల్ని కోరారు.












Click it and Unblock the Notifications