ఢిల్లీ ఎన్నికలు: సీఎం అభ్యర్ధిగా కిరణ్ బేడీ, స్పష్టం చేసిన ఆర్ఎస్ఎస్
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎన్నికల బరిలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా మాజీ ఐపీఎస్ అధికారిణి కిరణ్ బేడీ పోటీ చేయనున్నారని ఆర్ఎస్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. మూడు రోజుల క్రితమే కిరణ్ బేడీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో పార్టీలో చేరిన విషయం తెలిసిందే.
పార్టీ ఆదేశిస్తే ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్పై పోటికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. ఈ నేపథ్యంలో బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్ధి కిరణ్ బేడీ అంటూ ఆర్ఎస్ఎస్ ఆదివారం నాడు స్పష్టం చేసింది. ఇది ఇలా ఉంటే పార్టీ కోసం ఎప్పటి నుంచో కృషి చేస్తున్న సీనియర్లు మాత్రం సీఎం అభ్యర్ధిగా కిరణ్ బేడీ పేర్కొనడంపై కాస్తంత అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఢిల్లీ బిజెపికి నాయకత్వం వహిస్తారా అన్న మీడియా ప్రశ్నకు కిరణ్ బేడీ స్పందిస్తూ.. తాను పార్టీ కార్యకర్తనని, నాయకత్వం అంశంపై పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్నారు. అధినాయకత్వం ఎలాంటి బాధ్యతలు అప్పగించినా తాను సిద్ధమేనని అన్నారు. ఢిల్లీ ప్రజలు అనునిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రత్యేక వ్యవస్థను రూపొందిస్తామని చెప్పారు.

కిరణ్ బేడీ పేర్కొన్న 6-పీ ఫార్ములాలో జైళ్ళ సంస్కరణలు (ప్రిజన్స్), వేగవంతమైన కేసుల విచారణ (ప్రాసిక్యూషన్), ప్రజలకు చేరువలో ప్రభుత్వం (పబ్లిక్ ఔట్ రీచ్), తల్లిదండ్రులకు సహాయం (పేరెంట్స్), పోలీస్ వ్యవస్థ మెరుగుదల, కమ్యూనిటీ పోలీసింగ్ (పోలీస్), మీడియా వ్యవహారాలు (ప్రెస్) ఉన్నాయి.
తాము ప్రతిపాదించిన అంశాలపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని చెప్పారు. ఈ పనులన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నేరుగా జరుగుతాయన్నారు. మహిళల భద్రతలో ఎలాంటి లోటుపాట్లున్నాయనే విషయాలపై సమీక్ష చేపడతామని కిరణ్ బేడీ చెప్పారు. ఎవరికి ఎలాంటి సాయం కావాలన్న అంశాలపై మీడియా, పోలీసులు తమకు సమాచారం అందిస్తారని అన్నారు.
ఢిల్లీలో స్వచ్ఛంద సంస్ధలు ఎంతో కృషి చేస్తున్నాయని, స్వచ్ఛంద సంస్థలనూ కలుపుకుని పోతామని ఆమె తెలిపారు.












Click it and Unblock the Notifications