ఆర్ఎస్ఎస్ నాయకుడి హత్య, నోరు విప్పారు
బెంగళూరు: బెంగళూరు నగరంలోని శివాజీనగర్ సమీపంలోని కామరాజ్ రోడ్డులో అక్టోబర్ 16న హత్యకు గురైన ఆర్ఎస్ఎస్, బీజేపీ నాయకుడు రుద్రేష్ హత్య కేసులో నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
మహమ్మద్ సాధిక్, మహమ్మద్ ముజీబుల్లా, వాసిమ్ అహమ్మద్, ఇర్ఫాన్ పాష అనే నలుగురిని అరెస్టు చేశామని బెంగళూరు పోలీసు అధికారులు చెప్పారు. రుద్రేష్ హత్యకు కారణాలను బెంగళూరు నగర పోలీసులు మీడియాకు చెప్పారు.
రుద్రేష్ ను హత్య చేసిన వారిలో ఓ వ్యక్తి స్కూటర్ సర్వీస్ సెంటర్ (గ్యారేజ్) నిర్వహిస్తున్నాడు. అతని దగ్గర బైక్ రిపేర్ చేయించడానికి రుద్రేష్ అప్పుడప్పుడు వెళ్లేవాడు. ఓ సారి అతని దగ్గర రుద్రేష్ బైక్ వదిలి పెట్టాడు.
బెంగళూరులో ఆర్ఎస్ఎస్ నాయకుడి హత్య: బంద్
బైక్ రిపేర్ చేసిన తరువాత మెకానిక్ టెస్ట్ డ్రైవ్ కోసం తీసుకు వెళ్లాడు. ఆ సమయంలో మెకానిక్ బైక్ తో పాదచారిని ఢీకొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారించగా తాను బైక్ తో పాదచారిని ఢీకొనలేదని, రుద్రేష్ ఢీకొట్టాడని మెకానిక్ పోలీసులకు చెప్పాడు.
ఆ సమయంలో రుద్రేష్, మెకానిక్ ఇద్దరి మధ్య వాగ్వివాదం జరిగింది. అంతే కాకుండా రుద్రేష్ శివాజీనగర్ పరిసర ప్రాంతాల్లో గోమాంసం విక్రయిస్తున్న దుకాణాలను పోలీసుల సహకారంతో మూయించాడు. ఈ విషయాలపై నిందితులు రుద్రేష్ మీద కక్ష పెంచుకున్నారు.
చివరికి పక్కా ప్లాన్ వేసుకుని రుద్రేష్ ను హత్య చేశారని పోలీసులు చెప్పారు. హత్య జరిగే సమయంలో సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిందితుల ముఖం స్పష్టంగా రికార్డు కాలేదని, అయితే వారు పారిపోతున్న సమయంలో స్థానిక కానిస్టేబుల్ నిందితులను గుర్తించారని పోలీసు అధికారులు తెలిపారు.