కరోనా కొత్త వైరస్ భయాలు- బ్రిటన్ ప్రయాణికులకు కొత్త మార్గదదర్శకాలు- ఇవి తప్పనిసరి
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం తగ్గుతుందని భావిస్తున్న తరుణంలో బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికుల ద్వారా కొత్త రకం వైరస్ వ్యాప్తి చెందుతున్నట్లు కేంద్రం గుర్తించింది. ఇప్పటికే దాదాపు 30 కొత్త వైరస్ కేసులను వివిధ ల్యాబ్లు నిర్ధారించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇవాళ బ్రిటన్ ప్రయాణికులకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది.
ప్రస్తుతానికి జనవరి 7 వరకూ బ్రిటన్ నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలపై కేంద్రం నిషేధం విధించింది. దీన్ని మరింత కాలం పొడగించాలా వద్దా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. పొడిగిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. అలా కాకుండా నిషేధం తొలగిస్తే మాత్రం అక్కడి నుంచి వచ్చే ప్రయాణికులు పాటించాల్సిన కొత్త మార్గదర్శకాలను కేంద్రం ఇవాళ విడుదల చేసింది. వీటిని ప్రయాణికులు తప్పనిసరిగా పాటించాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా విమానాశ్రయ అధికారులకు సహకరించాలని కేంద్రం తాజాగా కోరింది.
కేంద్రం విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం బ్రిటన్ నుంచి వచ్చే ప్రయాణికులు అక్కడే కరోనా టెస్టు చేయించుకుని నెగెటివ్గా నిర్దారణ అయ్యాకే ప్రయాణాలు ప్రారంభిచాలి. భారత్ చేరుకోగానే మరోసారి ఆర్టీ-పీసీఆర్ టెస్టు చేయించుకోవాలి. అందులో పాజిటివ్ లేదా నెగెటివ్గా తేలినా తప్పనిసరిగా 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాల్సిందేనని కేంద్రం స్పష్టం చేసింది. విమానాశ్రయాల్లో చేయించుకునే ఆర్టీ-పీసీఆర్ టెస్టులకు అయ్యే ఖర్చును కూడా ప్రయాణికులే భరించాలని తెలిపింది. అలాగే యూకే నుంచి వచ్చే ప్రయాణికులంతా తమ ప్రయాణాల వివరాలను భారత్కు వచ్చే మూడు రోజుల ముందే ఆన్లైన్లో సెల్ఫ్ డిక్లరేషన్ రూపంలో సమర్పించాలని కేంద్రం ఉత్తర్వుల్లో పేర్కొంది. జనవరి 30 వరకూ ఈ కొత్త మార్గదర్శకాలు అమల్లో ఉంటాయని కేంద్రం తెలిపింది.