భారత్, రష్యా మధ్య 20 కీలక ఒప్పందాలు: నెగ్గామని మోడీ, పుతిన్ ఓకే..
ఢిల్లీ: భారత్, రష్యా దేశాల మధ్య గురువారం నాడు కీలక ఒప్పందాలు జరిగాయి. రక్షణ, అణు ఇంధన, వాణిజ్య, చమురు, సహజవాయువులు తదితర రంగాలకు సంబంధించి ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరిగాయి. భారత్ పర్యటనలో ఉన్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో ప్రధాని నరేంద్ర మోడీ కీలక చర్చలు జరిపారు. ఇరు దేశాలు ఒప్పందాల పైన సంతకాలు చేశాయి.
ఐడీఎఫ్సీ, రష్యా ప్రత్యక్ష పెట్టుబడుల సంస్థ మధ్య పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. భారత్, రష్యా శాస్త్ర సాంకేతిక పరిసోధన సంస్థల మధ్య కూడా ఒప్పందం కుదిరింది. ఎస్ఆర్ ఆయిల్, రాస్నెట్ మధ్య చమురు సరఫరా ఒప్పందం కుదిరింది. ఉభయ దేశాల మధ్య 20 ఒప్పందాలు కుదిరాయి.
కాలపరీక్షలో ఇరు దేశాలు నెగ్గాయి: మోడీ

భారత్, రష్యా సంబంధాల విషయంలో కాలపరీక్షలో నెగ్గాయని మోడీ ఈ సందర్భంగా అన్నారు. ఏటా ఇరు దేశాల మధ్య వ్యూహబంధ సమావేశాలు ఉండాలని వాజపేయి సమయంలో జరిగిన నిర్ణయమన్నారు. భారత్ రక్షణ రంగంలో రష్యాది మరువలేని పాత్ర అన్నారు. భారత్కు అత్యంత ప్రధానమైన రక్షణ భాగస్వామి రష్యా అన్నారు.
భారత్లో రక్షణ పరికరాల తయారు చేయాలన్ని నిర్ణయానికి రష్యా సహకరిస్తోందన్నారు. వివిధ సవాళ్లలో రష్యాకు భారత్ అండగా నిలిచిందని చెప్పారు. భారత్కు రష్యా ఎప్పుడు రక్షణ విషయంలో చేదోడువాదోడుగా ఉంటోందన్నారు.
కుడంకుళం ప్రాజెక్టు దానికి నిదర్శనమన్నారు. కుడంకుళంలా మరో మూడు యూనిట్లు సజావుగా సాగుతాయన్నారు. చమురు, సహజవాయు రంగాల్లో ఈ రోజు జరిగిన ఒప్పందాలు భవిష్యత్తు స్నేహానికి సూచిక అన్నారు. ఈ సందర్భంగా పుతిన్కు మోడీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
ప్రోత్సహిస్తున్నాం: పుతిన్
భారత్లో పెట్టుబడులు పెట్టేందుకు తమ దేశ సంస్థలను ప్రోత్సహిస్తున్నామని వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. తన పర్యటన ద్వారా భారత్, రష్యా సంబంధాలు మరింత పటిష్టమవుతాయన్నారు. కుడంకుళం మొదటి యూనిట్ను విజయవంతంగా ప్రారంభించామని, మిగిలిన మూడు యూనిట్లను కూడా అదే స్ఫూర్తితో పూర్తి చేస్తామన్నారు. భారత్, రష్యాలు సహజమిత్రులుగా కొనసాగుతున్నాయని, ఇది కలకాలం నిలవాలన్నారు. ఢిల్లీ - ముంబై పారిశ్రామిక కారిడార్కు సహకరిస్తామని చెప్పారు. ఇరు దేశాల మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయన్నారు.












Click it and Unblock the Notifications