ఢిల్లీలో రష్యా విదేశాంగమంత్రి-జైశంకర్ తో చర్చలు-కీలక హామీలు-భారత్ వైఖరిపై ప్రశంసలు
ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర కొనసాగిస్తున్న నేపథ్యంలో అంతర్జాతీంగా భారత్ పై పశ్చిమదేశాలు ఒత్తిడి పెంచుతున్నాయి. తాజాగా అమెరికా డిప్యూటీ భద్రతా సలహాదారు కూడా భారత్ వచ్చి వెళ్లారు. రష్యాకు సహకరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని భారత్ ను హెచ్చరించి మరీ వెళ్లారు. ఇలాంటి సమయంలో రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్ రోవ్ ఇవాళ భారత్ వచ్చారు. మన విదేశాంగమంత్రి జైశంకర్ తో భేటీ అయ్యారు.

భారత్-రష్యా విదేశాంగమంత్రుల భేటీ
రాయితీతో కూడిన రష్యన్ చమురును భారత్ ఎక్కువ పరిమాణంలో కొనుగోలు చేయగలదనే సంకేతాల మధ్య ఉన్నత ఇవాళ విదేశాంగమంత్రుల స్థాయి చర్చలు జరిగాయి. ఇందులో భారత్ నుంచి జైశంకర్, రష్యా నుంచి సెర్గీ లావ్ రోవ్ పాల్గొన్నారు. ద్వైపాక్షిక వాణిజ్యం కోసం రూబుల్-రూపాయి ఏర్పాటుపై ఇరువురు మంత్రులు ఆసక్తి చూపారు. రష్యా అధినేత పుతిన్ నుంచి భారత ప్రధాని మోడీకి ఓ సందేశం తెచ్చినట్లు విదేశాంగమంత్రి లావ్ రోవ్ తెలిపారు. పుతిన్, మోడీ పరస్పరం నిత్యం టచ్లోనే ఉన్నారని ఆయన తెలిపారు.

భారత్ పై లావ్ రోవ్ ప్రశంసలు
ఈ సందర్భంగా రష్యా విదేశాంగమంత్రి సెర్గీ లావ్రోవ్ భారత్ పై ప్రశంసలు కురిపించారు. ముఖ్యంగా భారత విదేశాంగ విధానం, ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో భారత్ అనుసరించిన వైఖరిపై లావ్రోవ్ కృతజ్ఢతలు తెలిపారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనా భారత్, రష్యాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని చెప్పారు. అమెరికాను ఉద్దేశించి మాట్లాడుతూ కొన్ని దేశాలు చైనా బూచి చూపి భారత్ ను బెదిరించేందుకు ప్రయత్నిస్తున్నాయని లావ్రోవ్ చెప్పారు.
భారత విధానాలు.. వారి దేశ ప్రయోజనాల్ని దృష్టిలో పెట్టుకునే ఉంటాయన్నారు. ఉక్రెయిన్ తో పోరు విషయంలో పశ్చిమదేశాలు ఏదైనా సానుకూల పరిష్కారంతో వస్తే ఆలోచిస్తామన్నారు.

భారత్ కు ఏదైనా అమ్మేందుకు ఓకే
భారత్ రష్యా నుంచి ఏదైనా కొనుగోలుకు సిద్ఘంగా ఉంటే దాన్ని అమ్మేందుకు సిద్ధంగా ఉందని లావ్రోవ్ ఆఫర్ ఇచ్చారు.
తమకు పట్టున్న ఇంధనం, సైన్స్, ఫార్మాస్యూటికల్స్ రంగాలలో ఇప్పటికే భారత్ తో అన్ని ప్రాజెక్టుల్ని పంచుకుంటూనే ఉన్నామన్నారు. కోవిడ్తో పోరాటం విషయంలో భారత్ కు రష్యా చేసిన సాయం గుర్తుచేశారు. అలాగే ఉక్రెయిన్ విషయంలోనూ తమ వైఖరి భారత్ కు తెలుసన్నారు. భారత్ తన నిర్ణయాలు తాను తీసుకోవాలని ఆయన కోరారు.

భారత్ కు రష్యా ఆఫర్ ఇదే
అంతర్జాతీయంగా ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో నేరుగా భారత్ కు చమురు విక్రయాలపై రష్యా భారీ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం భారత్ కు ఉక్రెయిన్ యుద్ధానికి ముందున్న ధరల కంటే రూ.35 డాలర్ల తగ్గింపుతో చమురు అమ్మేందుకు రష్యా అంగీకరించినట్లు తెలుస్తోంది. అదీ రష్యాలో నాణ్యమైన ఉరల్స్ శ్రేణి చమురును అమ్మేందుకు రష్యా ఆఫర్ ఇచ్చింది. ఈ ఏడాది 15 మిలియన్ బ్యారెళ్ల కాంట్రాక్టును భారత్ తీసుకోవాలని రష్యా కోరుకుంటోందని, ప్రభుత్వ స్థాయిలో చర్చలు జరుగుతున్నాయని బ్లూమ్ బర్గ్ నివేదిక తెలిపింది.












Click it and Unblock the Notifications