రక్షణ రంగంలో చైనాకు ధీటుగా భారత్: అమెరికా సహకారం: రష్యా హ్యాపీ: ఒక్క దెబ్బకు రెండు పిట్టలు
న్యూఢిల్లీ: భారత్-అమెరికా మధ్య కొనసాగుతున్న దౌత్య సంబంధాలు, ఒప్పందాల వ్యవహారంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. శతృవుకు శతృవు మిత్రుడైనట్లు చైనాను ఎదుర్కొనడానికి భారత్ను అస్త్రంగా మలచుకుంటోంది. చైనాకు ధీటుగా తనదేశ రక్షణ వ్యవస్థను పెంపొందించుకోవడానికి అమెరికా.. భారత్కు తనవంతు సహకారాన్ని అందిస్తోంది. ఈ దిశగా మొదటి అడుగు పడింది కూడా. అత్యంత శక్తిమంతమైన ఎస్-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయడంపై నిషేధించిన ఆంక్షలను అమెరికా తాజాగా ఎత్తేసింది.
ఎస్-400..
రష్యా నుంచి కొనుగోలు చేసిన క్షిపణ వ్యవస్థ అది. 2018లో 40 వేల కోట్ల రూపాయల వ్యయంతో అయిదు ఎస్-400 క్షిపణులను భారత్ కొనుగోలు చేసింది. అప్పట్లో అధికారంలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం ఈ కొనుగోలు ప్రక్రియను వ్యతిరేకించింది. ఆంక్షలను విధించింది. భారత్తో పాటు ఎస్-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసిన నాటో సభ్య దేశం టర్కీపైనా ఈ ఆంక్షలను వర్తింపజేసింది. కౌంటరింగ్ అమెరికాస్ అడ్వెర్సరీస్ థ్రో శాంక్షన్స్ యాక్ట్ (కాట్సా) కింద ఆంక్షలను తీసుకొచ్చింది.
ఆంక్షల తొలగింపు..
ఇప్పుడు తాజాగా అమెరికా ఈ ఆంక్షలను తొలగించింది. కాట్సా మినహాయింపు ప్రకటించింది. దీనికి సంబంధించిన తీర్మానాన్ని కాలిఫోర్నియా రెప్రజెంటేటివ్ రో ఖన్నా కాంగ్రెస్లో ప్రవేశపెట్టారు. దీనికి సభ ఆమోదం తెలిపింది. దీనితో భారత్ ఇకపై మరిన్ని ఎస్-400 క్షిపణి వ్యవస్థలను కొనుగోలు చేయడానికి వీలు కలిగినట్టయింది. ఈ ఆంక్షలను మాఫీ చేయించుకోవడంలో భారత్ వ్యూహాత్మకంగా వ్యవహరించినట్టే.
ఒక్క దెబ్బకు రెండు పిట్టలు..
ఒక్క దెబ్బకు రెండు పిట్టలను కొట్టినట్టే. ఉక్రెయిన్తో యుద్ధం చేస్తోన్న రష్యాపై అమెరికా ఇప్పటికే నిప్పులు చెరుగుతోంది. రష్యాపైనా విపరీతమైన ఆంక్షలు, నిషేధాజ్ఞలను ప్రకటించింది. అదే రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థను భారత్ కొనుగోలు చేయడానికి అమెరికా పరోక్షంగా సహకరించడం అంటే మాటలు కాదు. ఈ విషయంలో రష్యా కూడా ఇకపై స్వేచ్ఛగా దీన్ని భారత్కు అందజేస్తుందనడంలో సందేహాలు అక్కర్లేదు.
బద్ధశతృవులే అయినప్పటికీ..
బద్ధ శతృవులైన రష్యా-అమెరికాను భారత్ ఏకతాటిపైకి తీసుకొచ్చినట్టయింది. ఆంక్షలను తొలగించడం ద్వారా రష్యా నుంచి ఆ మిస్సైల్ సిస్టమ్స్ను భారత్ కొనుగోలు చేయడానికి అమెరికా అంగీకరించినట్టయింది. పొరుగునే ఉన్న చైనా, పాకిస్తాన్ నుంచి భారత్ తరచూ ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధ వాతావరణాన్ని చవి చూస్తూ వస్తోన్న విషయం తెలిసిందే. భారత్కు ఇబ్బందులను గురి చేసే విషయంలో చైనా మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు కారణమౌతోంది.
అత్యాధునికమైన వ్యవస్థ..
దీన్ని దృష్టిలో ఉంచుకుని అయిదు ఎస్-400 మిస్సైల్స్ సిస్టమ్ను భారత్ కొనుగోలు చేసింది. వాటిని ఉత్తర, పశ్చిమ సరిహద్దుల వద్ద మోహరింపజేసింది. ప్రపంచంలోనే అత్యాధునికమైన క్షిపణి వ్యవస్థ ఇది. యుద్ధ విమానాలు, బాలిస్టిక్, క్రూయిజ్ మిస్సైళ్ల వంటి 36 టార్గెట్లను ఏకకాలంలో ఛేదించే శక్తిసామర్థ్యాలు ఈ ఎస్-400 వ్యవస్థకు ఉంది. చైనా, పాకిస్తాన్కు తెంపరితనానికి చెక్ పెట్టేలా భారత్.. తన రక్షణ వ్యవస్థలోకి వీటిని తీసుకొచ్చింది.