Sabarimala:శబరిమలలో భక్తుల సంఖ్య పెంచుతూ కేరళ సర్కార్ నిర్ణయం..రీజన్ ఇదే!!
రెండేళ్ల క్రితం యువతుల ప్రవేశంపై ఏర్పడ్డ గందరగోళం తర్వాత, కరోనా లాక్ డౌన్ కారణంగా 7 నెలలపాటు మూసివేసిన అయ్యప్ప ఆలయం ప్రస్తుతం ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకుంది. మండల, మకర విళక్కు పూజల కోసం రెండు నెలల పాటు తెరచిన విషయం తెలిసిందే. తాజాగా శబరిమల తీర్థయాత్రకు అనుమతి ఇచ్చిన తర్వాత భక్తులు దర్శనానికి సంబంధించి కఠిన నిబంధనలు విధించింది ట్రావెన్కోర్ దేవస్థానం. అయితే ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న కారణంగా తాజాగా రాష్ట్ర ప్రభుత్వం శబరిమల అయ్యప్ప ఆలయంలో అనుమతించే భక్తుల సంఖ్య విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
వారాంతాల్లో ౩ వేల మందికి , మిగతారోజులలో 2 వేలమంది భక్తులకు అనుమతి
శబరిమలకి వచ్చే భక్తుల సంఖ్య పెంచాలని నిర్ణయించింది కేరళ ప్రభుత్వం . ప్రస్తుతం ఒక రోజుకు 1000 మంది భక్తులను అనుమతిస్తున్న దేవస్థానం ఇక నుండి 2000 వరకు భక్తులను అనుమతించనుంది. ఇక వారాంతపు సెలవు దినాలలో 2000 నుంచి 3000 వరకు భక్తుల సంఖ్య పెంచినట్లుగా తెలుస్తుంది. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టిడిబి) విజ్ఞప్తి మేరకు ప్రధాన కార్యదర్శి విశ్వస్ మెహతా అధ్యక్షతన తీర్థయాత్రల కమిటీ ఉన్నతస్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆర్ధిక కష్టాల దృష్ట్యా ట్రావెన్కోర్ దేవస్థానం విజ్ఞప్తి .. సర్కార్ నిర్ణయం
కేరళ రాష్ట్రంలో విపరీతంగా ఉన్న కోవిడ్ పరిస్థితిని, పెరుగుతున్న కేసులను పేర్కొంటూ భక్తుల సంఖ్య పెంచడంపై ఆరోగ్య శాఖ తీవ్రంగా అభ్యంతరం తెలిపింది. అయినప్పటికీ తాజా ఆర్థిక కష్టాల దృష్ట్యా భక్తుల సంఖ్య పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఎంత మంది భక్తుల సంఖ్య పెంచుతారనే ఖచ్చితమైన సంఖ్యలను తెలియజేస్తూ నేడు ఉత్తర్వులు జారీ చేస్తుందని తెలుస్తోంది. భక్తులు పంపా మరియు సన్నిధానం మధ్య వేర్వేరు ప్రదేశాలలో ఉంటారు కాబట్టి భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ పెద్దగా రద్దీ ఉండదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ప్రతిరోజూ సాయంత్రం ఆలయం ముందు అసలే కనిపించని భక్తులు
అలాగే ఆలయ ప్రాంగణంలో తీసుకుంటున్న కరోనా జాగ్రత్తలు కరోనా వ్యాప్తి జరగకుండా నిరోధిస్తాయి అని ట్రావెన్కోర్ దేవస్థానం అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం అయ్యప్ప స్వామి గర్భగుడి ముందు కఠినమైన కరోనా నిబంధనల కారణంగా సాయంత్ర సమయంలో ఒక్క భక్తుడు కూడా ఉండడంలేదని, ఈ సందర్భంలో భక్తుల సంఖ్యను పెంచాలని మేము ఈ ప్రతిపాదన చేసామని టిడిబి అధ్యక్షుడు ఎన్ వాసు అన్నారు. ముందు జాగ్రత్త చర్యలు అనుసరిస్తున్నామని పేర్కొన్న ఆయన ఒక్క భక్తుడికీ కూడా ఇప్పటివరకు పాజిటివ్ రాలేదని చెప్తున్నారు.
కరోనా కంట్రోల్ కోసం ట్రావెన్కోర్ దేవస్థానం నిర్ణయం .. ఔషధయుత త్రాగునీరు
యాత్రికుల కోసం ట్రావెన్కోర్ దేవస్థానం కరోనా వ్యాప్తిని నివారించడం కోసం ప్రత్యేకంగా తయారుచేసిన ఔషధ తాగునీటిని పంపిణీ చేసే వ్యవస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే . అయ్యప్ప ఆలయంలో యాత్రికులకు కోవిడ్ సమయంలో అనారోగ్యం దరిచేరకుండా ఔషధయుక్తమైన తాగునీటిని అందిస్తుంది. బేస్ క్యాంప్ అయిన పంబాలో ఆంజనేయ ఆడిటోరియం వద్ద ఈ ఔషధ తాగునీటిని అందుబాటులో ఉంచారు. నడక మార్గంలో పంబా, చరల్మెడు, జ్యోతినగర్, మాలికపురం వంటి వివిధ ప్రదేశాలలో కూడా పేపర్ గ్లాస్లో ఔషధయుతమైన త్రాగు నీరు పంపిణీ చేయబడుతుందని, కోవిడ్ -19 ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఈ నీటిని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు.
ట్రావెన్కోర్ దేవస్థానం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
శబరిమలలోని నాలుగు ఔషధ నీటి పంపిణీ కేంద్రాలలో షిఫ్ట్ ప్రాతిపదికన ముగ్గురు నలుగురు ఉద్యోగులు పనిచేస్తున్నారు. మొత్తం 55 మంది తాత్కాలిక ఉద్యోగులు అక్కడ రోజుకు ఎనిమిది గంటలు పనిచేస్తున్నారని తాగునీటి కార్యక్రమానికి ప్రత్యేక అధికారి ధను ఎస్ కృష్ణన్ పేర్కొన్నారు. కరోనా కారణంగా ఈ చర్యలు తీసుకుంటున్నామని ట్రావెన్కోర్ దేవస్థానం చెబుతోంది. ఏది ఏమైనా కరోనా వ్యాప్తి జరగకుండా , భక్తుల ఆరోగ్య రక్షణ కోసం ట్రావెన్కోర్ దేవస్థానం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తుంది .