శబరిమల: రెహానా ఫాతిమా ఇష్యూలో కొత్త ట్విస్ట్, బహిష్కరించిన ముస్లీం పెద్దలు
శబరిమల: శబరిమల ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన ముస్లీం మహిళ, మహిళా హక్కుల కార్యకర్త రెహానా ఫాతిమాను ముస్లీం సమాజం బహిష్కరించింది. రెహానాను, ఆమె కుటుంబ సభ్యులను బహిష్కరించాలని ఎర్నాకులం సెంట్రల్ ముస్లీం జమాత్ను కేరళ జమాత్ కౌన్సెల్ ఆదేశించింది.
ఈ రెహానా ఫాతిమా గురించి మీకు తెలుసా?
రెహానా చేసిన పని వల్ల హిందూ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని, అదే సమయంలో ఆమె చేసిన పని హిందూ ఆచారానికి విరుద్ధమని చెప్పారు. అలాగే, మత విశ్వాసాలను కాలరాస్తూ విగ్రహారాధన చేయాలన్న ఆమె ఉద్దేశ్యం కారణంగా బహిష్కరిస్తున్నట్లు తెలిపారు.
ఆమె కిస్ ఆఫ్ లవ్ ఆందోళనలో పొల్గొన్నదని చెప్పారు. అలాగే అసభ్యకరంగా నటించిందన్నారు. కాబట్టి ఆమె ముస్లీం పేరును ఉపయోగించడానికి వీల్లేదన్నరు. రాష్ట్ర ప్రభుత్వం ఆమె పైన క్రిమినల్ కేసు నమోదు చేయాలన్నారు.
శనివారం ఉద్రిక్తత
తమిళనాడుకు చెందిన ఓ యాభై ఏళ్లలోపు మహిళ దర్శనానికి వచ్చినట్టు వదంతులు వ్యాపించడంతో భక్తులు ఆందోళనకు దిగారు. వలియ నాదపండాల్ క్యూ లైన్ వద్ద ఆమెను అడ్డగించారు. ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఇరుముడి ధరించి వచ్చారు. తన వయసు యాభై ఏళ్లు దాటిందని, దీక్ష తీసుకొని వచ్చానని చెప్పడంతో భక్తులు శాంతించారు.
అయ్యప్ప సన్నిధానంలో శనివారం తొమ్మిదేళ్ల బాలిక జనని భక్తుల దృష్టిని ఆకర్షించింది. 50 ఏళ్ల వయసు దాటిన తర్వాతే తాను మళ్లీ అయ్యప్ప దర్శనానికి వస్తానంటూ రాసిన ప్లకార్డును ఆమె పట్టుకొంది. తమిళనాడులోని మదురైకి చెందిన ఆమె తండ్రి ఆర్ సతీష్ కుమార్తో కలిసి వచ్చింది.