రివ్యూ పిటిషన్పై ఏకాభిప్రాయం రాలేదు, శబరిమలలో ఉద్రిక్త పరిస్థితి
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలోకి మహిళల ప్రవేశానికి సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినప్పటి నుంచి మహిళలు సహా భక్తులు, హిందూ సంఘాలు తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నాయి. సుప్రీం కోర్టు తీర్పు మీద రివ్యూ పిటిషన్పై ఓ నిర్ణయానికి రాలేదు.
ఆలయ నిర్వహణ చూసుకునే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు, పండలం రాజ కుటుంబం, ఆలయ ప్రధాన పూజారి, అయ్యప్ప సేవా సంఘం తదితర భక్తి సంఘాలు నేడు సమావేశమయ్యాయి. రివ్యూ పిటిషన్ వేయాలని పండలం పండలం ప్యాలెస్ శశికుమార్.. టెంపుల్ బోర్డును కోరారు. అయితే ఏకాభిప్రాయం రాలేదు.
మరోవైపు, శబరిమలలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. బుధవారం నుంచి ఆలయ ద్వారాలు తెరుచుకోనుండటంతో కొందరు మహిళలు వస్తున్నారు. ఆలయం వైపు వెళ్తున్న మహిళలను అయ్యప్ప భక్తులు అడ్డుకున్నారు. ఆలయంలోకి మహిళలను అడుగు పెట్టనిచ్చేది లేదని, అవసరమైతే దాడులకు వెనుకాడమని అంటున్నారు.
కేరళ ప్రభుత్వం మాత్రం సుప్రీం తీర్పును అమలు చేస్తామని, ఆలయ సందర్శనకు వచ్చే భక్తులకు తగిన భద్రత కల్పిస్తామని చెబుతోంది. శబరిమలలో అన్ని వయసుల మహిళల ప్రవేశానికి అవకాశం కల్పిస్తూ సుప్రీం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ కేరళలో పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతున్నాయి.
అయ్యప్ప భక్తులు శబరిమలలోకి ప్రవేశించే బస్సులు, ఇతర వాహనాల్లో మహిళల కోసం గాలిస్తున్నారు. మహిళలను వాహనాల నుంచి కిందకు దింపుతున్నారు. ఆలయానికి వెళ్లే మార్గంలో తొలి క్యాంప్ అయిన నీలక్కాల్ వద్దే మహిళలను అడ్డుకుంటున్నారు. ఇక్కడి నుంచి పంబా ప్రాంతానికి వెళ్తారు. గతంలో మహిళల్ని పంబా వరకు అనుమతించేవారు. అయితే ఇప్పుడు నీలక్కాల్ వద్దే ఆపేశారు. తీర్పుపై పునఃసమీక్ష పిటిషన్ దాఖలు చేయబోమని, కోర్టు తీర్పును అమలు చేస్తామని, భక్తులకు భద్రత కల్పిస్తామని సీఎం చెప్పారు.