కేంద్రం పలాయనం, కుట్ర చేసింది: సబ్బం, టిడిపి ఫైర్
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం పలాయనం చిత్తగించిందని అధికార పార్టీ కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు సబ్బం హరి వ్యాఖ్యానించింది. సభ జరగకుండా కాంగ్రెసు పార్టీ కుట్ర చేసిందని ఆయన అన్నారు. బుధవారం లోకసభ వాయిదా పడిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. తాము ప్రతిపాదించిన అవిశ్వాస తీర్మానం చర్చకు రాకుండా చూడడానికే కాంగ్రెసు కుట్ర చేసిందని ఆయన ఆరోపించారు. స్వపక్షం సభ్యులతో లోకసభలో కాంగ్రెసు గొడవ చేయించిందని ఆయన అన్నారు.
ఎప్పుడూ లేని విధంగా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు కూడా ఈ రోజు వెల్లోకి వచ్చారని ఆయన అన్నారు. అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోలేకనే కుట్ర పన్ని స్వపక్షంతో కలిసి సభ నడవకుండా కుట్ర చేసిందని ఆయన అన్నారు. సభను నిరవధికంగా వాయిదా వేయడానికి కూడా కుట్ర చేస్తున్నట్లు తెలుస్తోందని ఆయన వ్యాఖ్యానించారు.
తమకు మద్దతు ఉందే కాబట్టి కాంగ్రెసు ఆ విధంగా చేసిందని ఆయన అన్నారు. అవిశ్వాసం చర్చకు వస్తే ఓడిపోతామనే భయం ప్రభుత్వానికి పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు. అనుకున్నదానికన్నా రెండు, మూడు రెట్లు అధికంగా తమకు మద్దతు ఉందని ఆయన అన్నారు. తమకు ఎవరూ నీతులు చెప్పాల్సిన అవసరం లేదని, తాము ఆరుగురం కూడా కింది స్థాయి నుంచి పైస్థాయి వరకు పార్టీలో బాధ్యతలు నిర్వహించామని ఆయన అన్నారు.
వ్యక్తుల మీద తాను మాట్లాడదలుచుకోలేదని ఆయన అన్నారు. తమపై ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుకోవచ్చునని ఆయన అన్నారు. సభను వాయిదా వేయడానికి కాంగ్రెసు తన అధికారాన్ని ఉపయోగించిందని ఆయన అన్నారు. తమను సస్పెండ్ చేయడానికి కాంగ్రెసు నాయకత్వానికి సర్వహక్కులూ ఉన్నాయని, సస్పెండ్ చేసినా తమకు అభ్యంతరం లేదని ఆయన అన్నారు. తాము ఎవరికో అమ్ముడు పోయి ఇదంతా చేయడం లేదని, తమ ప్రజల మనోభావాల మేరకే తాము అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించామని ఆయన చెప్పారు.
అధికారం పోతుందనే భయంతోనే..
అధికారం పోతుందనే భయంతో సభను అడ్డుకుంటోందని తెలుగుదేశం సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు కొనకళ్ల నారాయణ అన్నారు. తమకు తగినంత బలం ఉందని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు. సభా కార్యక్రమాలు సజావుగా జరిగే విధంగా స్పీకర్ చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ప్రభుత్వం కచ్చితంగా గద్దె దిగాల్సి వస్తుందని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వానికి కొనసాగే నైతిక హక్కు లేదని ఆయన అన్నారు. తమకు చాలా మంది సభ్యులు మద్దతు ఉందని మరో ఎంపి పార్లమెంటు సభ్యుడు శివప్రసాద్ అన్నారు. తమ ఫ్లోర్ లీడర్ అందుబాటులో లేరని కొనకళ్ల చెప్పారు. తాము విభజన అంశాన్ని ప్రస్తావించడం లేదని, అవినీతి మీద తాము పోరాటం చేస్తున్నామని ఆయన చెప్పారు.
సభా కార్యక్రమాలను సజావుగా నడపాల్సిన బాధ్యత స్పీకర్ మీద ఉందని మరో పార్లమెంటు సభ్యుడు నిమ్మల కిష్టప్ప అన్నారు. అన్ని పార్టీలతో చర్చించి సభను సజావుగా నడపడానికి ఎందుకు స్పీకర్ ప్రయత్నించడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వానికి స్పీకర్ అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఆయన ఆరోపించారు. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరగకుండా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన స్పీకర్ను ప్రశ్నించారు. సభ వాయిదా పడితే చాలు, తాము బయటపడుతామనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు. సభ నడవకపోతే తీవ్ర పరిణామాలు ఉన్నాయని ఆయన అన్నారు.