బంగారు కడ్డీల సాద్వీ జయశ్రీ అరెస్ట్: ఆమె మోసాలు అన్నిఇన్నీ కావు!
ఓ ఛీటింగ్ కేసులో నిందితురాలైన ప్రముఖ సాథ్వీ జయశ్రీ గిరిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అహ్మదాబాద్: ఓ ఛీటింగ్ కేసులో నిందితురాలైన ప్రముఖ సాథ్వీ జయశ్రీ గిరిని గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. బనాస్ కాంత జిల్లా పాలన్ పూర్ ప్రాంతానికి చెందిన సాథ్వీ జయశ్రీ గిరి తమ వద్ద రూ.5.2కోట్లను రుణంగా తీసుకొని తిరిగి చెల్లించకుండా మోసం చేశారని స్థానిక నగల వర్తకుడు ప్రీతీష్ షా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతోపాటు తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తామని చెప్పి కొందరినుంచి సాద్వీ డబ్బు తీసుకున్నారని పోలీసులు చెప్పారు.
పోలీసులు సాద్వీ జయశ్రీ నివాస గృహంపై దాడి చేసి వందగ్రాముల బరువున్న 24 బంగారు బిస్కెట్లు, రూ.1.29 కోట్ల రెండువేల రూపాయల నోట్లు, 22 విదేశీ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నామని బనాస్ కాంత డీఎస్పీ నీరజ్ బద్ గుజార్ చెప్పారు. ముగ్గురు వ్యక్తుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి సాద్వీని అరెస్టు చేశామని డీఎస్పీ వెల్లడించారు.
సాధ్వీ ఇంట్లో కోటి నగదు, 24 బంగారు కడ్డీలు స్వాధీనం
సాద్వీజయశ్రీ ముక్తేశ్వర్ మహాదేవ్ మఠంతోపాటు ఓ దేవాలయాన్ని నడుపుతున్నారని పోలీసులు చెప్పారు. సాద్వీ అరెస్టు అనంతరం ఆమె అనుచరుల్లో ఒకరైన చిరాగ్ అనే యువకుడి తల్లి ఇందిరాబెన్ మాట్లాడుతూ.. తన కుమారుడు 22 రోజులుగా కనిపించడం లేదని ఫిర్యాదు చేశారు.
గతంలో సాద్వీ అక్రమంగా ఆయుధాలు కలిగి ఉండటంతోపాటు హత్య కేసులోనూ నిందితురాలని స్థానిక మీడియాలో వార్తలు వచ్చాయి. కాగా తన ఇంట్లో డబ్బు కాని బంగారం, మద్యం గానీ దొరకలేదని సాద్వీ జయశ్రీ చెబుతుండటం గమనార్హం. ప్రస్తుతం సాద్వీని అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమె వ్యవహారంపై లోతుంగా దర్యాప్తు చేస్తున్నారు.