మోడీ పాపులారిటీ తగ్గడం లేదు: కాంగ్రెస్ నేత సల్మాన్
వాషింగ్టన్/న్యూఢిల్లీ: భారత ప్రధాని నరేంద్ర మోడీ వద్ద ఏదో తెలియని మ్యాజిక్ ఉందని, అదే ఆయన్ను పాపులర్ నేతగా నిలిపిందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ వ్యాఖ్యానించారు.
అమెరికాలోని జార్జ్ టౌన్ యూనివర్శిటీలో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. మోడీ పాపులారిటీ ఏ మాత్రం తగ్గడం లేదని, అయితే, భారతీయ జనతా పార్టీ మాత్రం తన ప్రాభవాన్ని క్రమంగా కోల్పోతోందని అన్నారు.
'ఇంకా మూడేళ్ల ప్రయాణం సాగాల్సి వుంది. నిజం ఏమిటంటే, బిజెపిపై నమ్మకం పోతోంది. ఇదే సమయంలో మరో నిజం కూడా ఒప్పుకోవాలి. బిజెపి పాపులారిటీ దిగజారుతుండగా, మోడీ పాపులారిటీ మాత్రం తగ్గడం లేదు. ఇది మంచిదా? చెడ్డదా? అన్నది నాకు తెలియదు. ఆయనో మెజీషియన్. 2019 ఎన్నికలకు ముందు కొన్ని ట్రిక్కులను ప్రజల ముందు ప్రదర్శించవచ్చు' అని ఖుర్షీద్ వ్యాఖ్యానించారు.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రాకపోతే, అది పార్టీకి విషాదకరమేనని అన్నారు. మోడీ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచుతామని చెప్పారు. ఈ ప్రభుత్వం స్వేచ్ఛకు సంకెళ్లు వేసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు.
మోడీ సర్కారుపై ఫిర్యాదు
నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు 'హార్స్ ట్రేడింగ్'కు పాల్పడుతూ.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను ఇబ్బందుల్లోకి నెడుతోందని ఆ పార్టీ సీనియర్ నేతలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలిసి ఫిర్యాదు చేశారు. తమకు స్పష్టమైన మెజారిటీ ఉన్న రాష్ట్రాల్లో రాజకీయ ప్రయోజనాల కోసం బిజెపి అలజడి సృష్టిస్తోందని ఆరోపించారు.
'బీజేపీ రాజ్యాంగ విరుద్ధంగా ఏకపక్ష, కఠోర నిర్ణయాలను తీసుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచేలా పన్నాగాలు పన్నుతోంది. ఉత్తరాఖండ్ లో కాంగ్రెస్ కు పూర్తి మెజారిటీ ఉన్నప్పటికీ, రాష్ట్రపతి పాలనకు సిఫార్సు చేయాలని చూస్తోంది. ఈ తరహా చర్యలను మీరు అడ్డుకోవాలి' అని ఓ మెమోరాండంను ఆ పార్టీ నేతలు గులాంనబీ ఆజాద్, ఏకే ఆంటోనీ, మోతీలాల్ ఓరా, అంబికా సోనీ, అహ్మద్ పటేల్, కపిల్ సిబాల్ తదితరులు రాష్ట్రపతికి అందించారు.
అమరవీరులకు మోడీ నివాళులు
అమరవీరులు భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్గురును ఉరితీసిన రోజు(మార్చి 23)ను స్మరిస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రధానినరేంద్ర మోడీ ట్విట్టర్లో నివాళులర్పించారు. వారిని నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. తమ తరువాత తరమైనా స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటుందనే భావనతో ఈ ముగ్గురు దేశభక్తులు చిన్న వయస్సులోనే దేశం కోసం ప్రాణాలర్పించారని మోడీ పేర్కొన్నారు.
పార్లమెంటుపై బాంబు దాడి కేసులో భగత్సింగ్, సుఖ్దేవ్, రాజ్గురులను నాటి బ్రిటిష్ ప్రభుత్వం మార్చి 23న ఉరి తీసింది. అలాగే, ఈ రోజు సోషలిస్ట్ నాయకుడు రాం మనోహర్ లోహియా జన్మదినం. ఈ సందర్భంగా లోహియా అప్పట్లో మహాత్మా గాంధీకి రాసిన ఓ లేఖను ట్విట్టర్లో ఉంచారు.