Sam Pitroda: చైనాను శత్రువుగా చూడటం మానేయండి.. పిట్రోడా వ్యాఖ్యలతో దుమారం
Sam Pitroda: కాంగ్రెస్ సీనియర్ నేత సామ్ పిట్రోడా ప్రకటనపై మరోసారి వివాదం తలెత్తింది.చైనా నుంచి వచ్చే ముప్పు ఊహించని విధంగా ఉంటుందని సామ్ పిట్రోడా ఒక ఇంటర్వ్యూలో అన్నారు. చైనాను శత్రువుగా పరిగణించడం భారత్ ఆపాలని ఆయన పేర్కొన్నారు. చైనాను గుర్తించి గౌరవించాల్సిన సమయం ఆసన్నమైందని.. ఇకైనైనా భారత్ తన వైఖరి మార్చుకొని శత్రువులా చూడడం మానుకోవాలని సామ్ పిట్రోడా సూచించారు. మొదటి నుంచి భారత్ వైఖరి ఇరు దేశాల మధ్య ఘర్షనాత్మక వైఖరిని కలిగి ఉందని.. అయితే ఇప్పుడు దేశాలు సహకారం వైపు పయనించాలని ఆయన సోమవారం పేర్కొన్నారు.
చైనా నుంచి వచ్చే ముప్పును ఆపడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీ విజయం సాధిస్తారా అని అడిగినప్పుడు ఆయన ఈ ప్రకటన చేశారు. అమెరికా ఎప్పుడూ తన శత్రువును ఎంచుకునే ధోరణిని కలిగి ఉంటుందని.. కాబట్టి ఈ విషయంగా పెద్దగా పట్టించుకోకపోవడమే మంచిదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం అన్ని దేశాలు ఒక్కతాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని సామ్ పిట్రోడా పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రపంచ దేశాలు కమ్యూనికేషన్ ను పెంచుకుంటూ సహకరించుకోవాలన్నారు.

తీవ్రంగా స్పందించిన బీజేపీ
సామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. కాంగ్రెస్ పార్టీకి చైనా పట్ల అమితమైన ప్రేమ ఉందంటూ బీజేపీ విమర్శించింది. కాంగ్రెస్ కు చైనా పట్ల వ్యామోహానికి మూల కారణం 2008లో కాంగ్రెస్, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ మధ్య కుదిరిన అవగాహన ఒప్పందం అంటూ బీజేపీ ఆరోపించింది. మన భూమిలో 40,000 చదరపు కిలోమీటర్లు చైనాకు ఇచ్చిన వారికి ఇప్పటికీ చైనా నుంచి ఎటువంటి ముప్పు కనిపించడం లేదని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి తుహిన్ సిన్హా విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ చైనాకు భయపడడంలో ఆశ్చర్యం లేదని ఆయన ఎద్దేవా చేశారు.
ద్వైపాక్షిక సమస్య
ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా డొనాల్డ్ ట్రంప్.. భారత్-చైనా ఉద్రిక్తత, రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘర్షణలను తగ్గించాల్సిన అవసరం ఉందని ట్రంప్ అన్నారు. భారత్-చైనా సరిహద్దులో ఘర్షణలు చాలా తీవ్రంగా ఉన్నాయని.. భారత్ కోరుకుంటే తాను మధ్యవర్తిత్వం వహించడానికి సిద్ధంగా ఉన్నానని ట్రంప్ అంగీకరించారు. అయితే ఇది ద్వైపాక్షిక సమస్య అంటూ భారత్ స్పష్టం చేసింది.












Click it and Unblock the Notifications