యూపీ ఎన్నికలు: ఎట్టకేలకు లెక్క కుదిరింది
ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదిరింది.
న్యూఢిల్లీ: ఎట్టకేలకు ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ), కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై ఏకాభిప్రాయం కుదిరింది. తద్వారా వారం రోజులుగా ముమ్మరంగా సాగిన చర్చలు, ఊహాగానాలకు తెర పడింది.
403 స్థానాలున్న యూపీ అసెంబ్లీలో ఎస్పీ 298 స్థానాల్లో, కాంగ్రెస్ పార్టీ 105 స్థానాల్లో పోటీచేస్తాయి. ఆదివారం సాయంత్రం లక్నోలో జరిగిన సంయుక్త మీడియా సమావేశంలో ఎస్పీ యూపీ శాఖ అధ్యక్షుడు నరేశ్ ఉత్తమ్, యూపీసీసీ అధ్యక్షుడు రాజ్ బబ్బర్ పొత్తుపై అధికారికంగా ప్రకటించారు.
తమ పొత్తు చారిత్రకమైందని, కేవలం ఉత్తరప్రదేశ్కు మాత్రమే కాకుండా యావత్ దేశాభివృద్ధికి నాంది పలుకుతుందన్నారు.
ఆర్ఎల్డీతో పొత్తుపై...
తొలుత అజిత్సింగ్ నేతృత్వంలోని రాష్ట్రీయ లోక్ దళ్ పార్టీ (ఆర్ఎల్డీ), కాంగ్రెస్ పార్టీ, ఎస్పీ పొత్తు పెట్టుకుంటాయని ఊహాగానాలు వినిపించాయి. నాలుగు రోజుల క్రితం స్వయంగా సీఎం అఖిలేశ్ యాదవ్ స్పం దించి కేవలం కాంగ్రెస్తో మాత్రమే పొత్తు ఉండే అవకాశం ఉన్నదన్నారు. ఆర్ఎల్డీతో అలాంటి చర్చలు లేవని స్పష్టం చేశారు. అజిత్ సింగ్ సారథ్యంలోని ఆర్ఎల్ డితో ఎస్పీ వ్యవస్థాపక నేత ములాయం సింగ్ యాదవ్ వ్యతిరేకత, జాట్ల ఆధిపత్య వైఖరే ఆ పార్టీతో పొత్తుకు వెనుకడుగు వేయడానికి కారణమా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
సీట్లపై పంతం..
చర్చల ప్రారంభం నుంచే సమాజ్వాదీ పార్టీ, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వద్దే ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఇరు పార్టీల నేతలు పంతాలకు పోవడంతో ఈ రెండు పార్టీల మధ్య పొత్తు ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ పార్టీ కనీసం 120 స్థానాలు కావాలని మంకుపట్టు పట్టింది. కానీ ఎస్పీ 100 స్థానాలకు మించి ఇవ్వలేమని తేల్చి చెప్పింది. తమ సిట్టింగ్ ఎమ్మెల్యేలే 229 మంది ఉన్నారని, వారితోపాటు ఆశావహులకు కూడా సీట్లు సర్దుబాటు చేయాలంటే తమ పార్టీకి 300కు తగ్గకుండా సీట్లు అవసరమని సీఎం అఖిలేశ్ స్పష్టంచేశారు. దీంతో కాంగ్రెస్ పార్టీకి గరిష్టంగా 103 స్థానాల కంటే ఎక్కువగా ఇచ్చే అవకాశమే లేదని తేలిపోయింది.
రెండు పార్టీలకూ అవసరమే...
సమాజ్ వాదీ పార్టీకి తిరిగి అధికారంలోకి రావాలంటే, కాంగ్రెస్ పార్టీకి సంస్థాగతంగా పార్టీ బలాన్ని పటిష్ఠ పరుచుకునేందుకు పొత్తు అవసరం. దీంతో సోనియాగాంధీ నేరుగా రంగంలోకి దిగారు. అఖిలేశ్యాదవ్తో సోనియాగాంధీ ఫోన్ సంప్రదింపులు జరిపారు. మరోవైపు డింపుల్ యాదవ్తో ప్రియాంకగాంధీ చర్చించారు. కాంగ్రెస్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా పొత్తు ఆవశ్యకతను వివరించి సీట్ల సంఖ్య కంటే అధికారంలోకి రావడం ముఖ్యమని ఇరు పార్టీలకు వివరించి రాజీ మార్గం సూచించారు. ఆ తర్వాతే రెండు పార్టీలు పోటీచేసే స్థానాల సంఖ్య ఖరారైంది.
యుపి ముఖ చిత్రంలో మార్పులు...
ఎస్పీ, కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తు కుదరడంతో ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముఖచిత్రంలో గణనీయ మార్పులు చోటుచేసుకునే అవకాశముంది. యాదవ్ - ముస్లిం ఓటు బ్యాంకును పటిష్టపర్చుకోవడంతోపాటు మ్యానిఫెస్టోల ద్వారా తటస్థ ఓటర్లనూ ప్రభావితం చేయవచ్చన్నది ఈ రెండు పార్టీల వ్యూహం. 2012 ఎన్నికల్లో ఎస్పీ 29.3% ఓట్లతో 229 స్థానాలను గెలుచుకుని అధికారాన్ని చేజిక్కించుకున్నది. 11.7% ఓట్లు పొందిన కాంగ్రెస్ పార్టీ 28 సీట్లలో విజయం సాధించింది. తమ మధ్య పొత్తుతో కనీసం 40% ఓట్లు లభిస్తాయని రెండు పార్టీల నేతలు అంచనా వేస్తున్నారు.
ప్రియాంక, డింపుల్ జోడీతో...
ప్రియాంకాగాంధీ-డింపుల్ యాదవ్ సమీకరణంతో మహిళా ఓటు బ్యాంకును ఆకట్టుకోవచ్చునని రెండు పార్టీలు భావిస్తున్నాయి. ప్రెషర్ కుక్కర్ లాంటి ఉచిత హామీలను పేర్కొనడం ఇందులో భాగమే. వీరితో ఒకే వేదిక నుంచి ఎన్నికల ప్రచారానికి రెండు పార్టీలు షెడ్యూల్ ఖరారు చేయనున్నాయని తెలుస్తున్నది.
కాంగ్రెసు ఇంచార్జీ ప్రియాంక
ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ ఉత్తరప్రదేశ్ వ్యవహారాల ఇన్ చార్జీగా, పార్టీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకగాంధీ అని కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంగీకరించింది. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా ట్విట్టర్ ద్వారా తెలిపింది. అనామకులతో పొత్తు చర్చలు జరుపాల్సి వచ్చిందని యూపీ సిఎం అఖిలేశ్ యాదవ్ నర్మగర్భ వ్యాఖ్యలు చేయడంతో స్పందించిన కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్ ‘చాలా దిగువస్థాయి శ్రేణులతో పొత్తు చర్చలు జరిగాయనడం సరికాదు. యూపీ సిఎం అఖిలేశ్, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి - యూపీ ఇన్చార్జి ప్రియాంకగాంధీ స్థాయిలో చర్చలు జరిగినందు వల్లే పొత్తు సాధ్యమైంది' అని ట్వీట్ చేశారు. తద్వారా ఎన్నికల పొత్తు క్రెడిట్ ప్రియాంకకు కట్టబెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ అధి నాయకత్వం ఆసక్తి చూపింది. దీన్ని బట్టి యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తిస్థాయి బాధ్యతలను ప్రియాంక చేపట్టే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.