అమ్మ మన హృదయాల్లోనే, 33ఏళ్ల అనుబంధం: శశికళ భావోద్వేగ ప్రసంగం
చెన్నై: అన్నాడీఎంకే అధినేత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత శశికళ నటరాజన్ తొలిసారి కార్యకర్తలను ఉద్దేశించి శనివారం ఉదయం మాట్లాడారు. జయలలిత చూపిన బాటలోనే నడుస్తానని ఆమె చెప్పారు. అమ్మ ఎప్పటికీ తన హృదయంలోనే ఉంటారని కంటతడి పెడుతూ భావోద్వేగానికి గురయ్యారు.

అమ్మ చేపట్టిన పనుల్ని చిత్తశుద్ధితో ముందుకు తీసుకెళతామని శశికళ స్పష్టం చేశారు. ప్రజల కోసమే ఈ పార్టీ అని అన్నారు. జయ ఆశయాల సాధనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. జయ చూపిన బాటలోనే పార్టీ నడుచుకుంటుందని స్పష్టం చేశారు. అమ్మే మన శక్తి, మన ధైర్యం అని చెప్పారు.
అమ్మలేదన్న వార్తను జీర్ణించుకోలేకపోతున్నామని అన్నారు. అమ్మే చూపిన బాటే మనకు మార్గదర్శి అని అన్నారు.అమ్మతో తనది 33ఏళ్ల అనుబంధమని కంటతడి పెట్టారు. నెచ్చెలి మరణాన్ని తాను జీర్ణించుకోలేకపోతున్నానని చెప్పారు.
జయలలిత మరణిస్తారని ఊహించలేదని అన్నారు. ఆస్పత్రిలో ఓ దశలో అమ్మపూర్తిగా కోరుకున్నారని.. ఆ సమయంలోనే ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అమ్మ మనకు దూరమయ్యారని తెలిపారు. జయ మరణంతో సర్వం కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
మన సంస్కృతి, సాంప్రదాయాలంటే జయకు చాలా ఇష్టమని, వాటిని కాపాడేందుకు తన వంతుగా ప్రయత్నిస్తానని చెప్పారు. కాగా, శశికళ మాట్లాడుతున్నంత సేపు కూడా నేతలు, కార్యకర్తల చప్పట్లు కొడుతూ ఆమెకు మద్దతు తెలిపారు. అనంతరం పార్టీ ఆఫీసు ముందుకు వచ్చిన చిన్నమ్మ.. తరలివచ్చిన నేతలు, కార్యకర్తలకు అభివాదం తెలిపారు.












Click it and Unblock the Notifications