'ఎవరి ఆటలు సాగవు, శశికళ ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ అడ్డుకోలేరు'
శశికళను ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోకుండా ఏ శక్తీ ఆపలేదని అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత కేఏ సెంగొట్టేయన్ మంగళవారం నాడు అన్నారు.
చెన్నై: శశికళను ముఖ్యమంత్రి పీఠం పైన కూర్చోకుండా ఏ శక్తీ ఆపలేదని అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేత కేఏ సెంగొట్టేయన్ మంగళవారం నాడు అన్నారు. జయలలిత మృతిపై ఆ పార్టీకి చెందిన మరో సీనియర్ నేత పాండియన్ చేసిన వ్యాఖ్యలపై ఈయన తీవ్రంగా స్పందించారు.
శశికళను ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఆమె ముఖ్యమంత్రి కాకుండా కొన్ని శక్తులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని తీవ్రంగా మండిపడ్డారు. వారి ఆటలు సాగవని హెచ్చరించారు. శశికళ ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు.

కాగా, అన్నాడీఎంకే పార్టీ చీఫ్గా శశికళకు కొందరు నేతలు ఎదురు తిరుగుతున్న విషయం తెలిసిందే. ఆమె శాసన సభా పక్ష నేతగా ఎన్నికైన తర్వాత మరింత ఎదురు దాడి జరుగుతోంది.
ఇప్పటికే ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం తిరుగుబావుటా ఎగరవేశారని అంటున్నారు. ఆయన వెంట పలువురు ఎమ్మెల్యేలు ఉన్నారని, శశికళకు చెక్ చెప్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.
మరోవైపు, దీపా జయకుమార్, పార్టీ నుంచి బహిష్కరణకు గురైన ఎంపీ శశికళ పుష్ప ఎప్పటికి అప్పుడు శశికళ పైన నిప్పులు చెరుగుతున్నారు. వైద్యులు హడావుడిగా సమావేశం ఎందుకు పెట్టారని నిలదీస్తున్నారు. తాజాగా, పార్టీ సీనియర్ నేత పిహెచ్ పాండియన్ పలు అనుమానాలు వ్యక్తాలు చేశారు.
జయలలిత ఇంట్లోనే కిందపడి ఆసుపత్రిపాలయ్యారని, అంతకు ముందు ఆమెకు ఎవరితోనో వాగ్వాదం జరిగిందని, జయ మరణం తర్వాత శశికళ బాధపడలేదని, సెప్టెంబర్ 22 రాత్రి పోయెస్గార్డెన్లో ఎవరెవరు ఉన్నారో దర్యాప్తు చేయాలని పాండియన్ డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications