సీఎం చెప్పారనే జైల్లో శశికళకు వీవీఐపీ సేవలు, మాజీ డీజీపీ, చిక్కుల్లో సిద్దూ, సీఎం క్లారిటీ!
బెంగళూరు: బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న వీకే శశికళకు వీవీఐపీ సేవలు చేసిన కేసు ఊహించని మలుపు తిరిగింది. శశికళకు వీవీఐపీ సేవలు అందిస్తున్నారని నమోదైన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక మాజీ డీజీపీ సత్యనారాయణ రావ్ ఏకంగా ఈ కేసులో ముఖ్యమంత్రి సిద్దరామయ్యను ఇరికించి కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపించారు.
ఫస్ట్ క్లాస్ ట్రీట్ మెంట్
కర్ణాటక సీఎం సిద్దరామయ్య మమ్మల్ని బెంగళూరులోని కుమారకృప గెస్ట్ హౌస్ కు పిలిపించి పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు ఫస్ట్ క్లాస్ ట్రీట్ మెంట్ ఇవ్వాలని, ఆమెకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని స్వయంగా సీఎం చెప్పారని మాజీ డీజీపీ సత్యనారాయణ రావ్ బాంబు పేల్చారు.
సీఎం ఆదేశాలు పాటించాం
ముఖ్యమంత్రి హోదాలో సిద్దరామయ్య చేసిన ఆదేశాలను తాము పాటించామని, శశికళ కోరుకున్న సదుపాయాలు కల్పించామని, ఇందులో తన వ్యక్తిగత ప్రమేయం ఏమీ లేదని మాజీ డీజీపీ సత్యనారాయణ రావ్ కర్ణాటక ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి వినయ్ కుమార్ నేతృత్వంలోని ప్రత్యేక కమిటీ ముందు వివరణ ఇచ్చారు.
హైకోర్టుకు మాజీ డీజీపీ
సీఎం సిద్దరామయ్య ఆదేశాల మేరకు ఓ అధికారిగా తాను పని చేశానని, అందులో తన తప్పు ఏమీ లేదని, ఏసీబీ అధికారులు తన మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను రద్దు చెయ్యాలని మాజీ డీజీపీ సత్యనారాయణ రావ్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు.
నేను చెప్పలేదు: సిద్దూ
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో వీకే. శశికళ నటరాజన్ కు వీవీఐపీ సేవలు చెయ్యాలని తాను అప్పటి జైళ్ల శాఖ డీజీపీ సత్యనారాయణ రావ్ కు చెప్పలేదని, ఇది పచ్చి అపద్దమని కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య అన్నారు.
సీఎం ఏం చెప్పారంటే !
తమిళనాడుకు చెందిన కొందరు తన కార్యాలయానికి వచ్చి పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదని ఫిర్యాదు చేశారని సిద్దరామయ్య అన్నారు. చట్టపరంగా ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తారో అలాంటి సౌకర్యాలు శశికళకు కల్పించాలని మాత్రమే తాను అప్పటి డీజీపీ సత్యనారాయణ రావ్ కు సూచించానని బుధవారం సీఎం సిద్దరామయ్య మీడియాకు చెప్పారు.
నా మీద పగ, సీఎం సిద్దూ
బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో జరిగిన అవ్యవహారాల గురించి విచారణ చెయ్యాలని తాను ఏసీబీ అధికారులకు ఆదేశించానని, అందుకోసం తన మీద పగతో మాజీ డీజీపీ సత్యనారాయణ రావ్ ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని సీఎం సిద్దరామయ్య బుధవారం మీడియాకు చెప్పారు.
చిక్కుల్లో సీఎం సిద్దూ
పరప్పన అగ్రహార సెంట్రల్ జైల్లో శశికళకు వీవీఐపీ సేవలు చేస్తున్నారని డీఐజీ రూపా గత ఏడాది ఆరోపించిన సమయంలో దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఇప్పుడు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్వయంగా ఆదేశించడం వలనే శశికళకు వీవీఐపీ సేవలు చేశామని మాజీ డీజీపీ సత్యనారాయణ రావ్ బాంబు పేల్చడంతో కాంగ్రెస్ పార్టీ ఇరకాటంలో పడింది.