పళనిస్వామి ప్రమాణస్వీకారాన్ని 'లైవ్' వీక్షించిన శశికళ..
పళనిస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని గురువారం నాడు జైల్లో శశికళ 'లైవ్' వీక్షించారు.
బెంగుళూరు: సీఎం పీఠంపై కూర్చోవడం ఇక లాంఛనమే అనుకుంటున్న తరుణంలో అనూహ్య పరిణామాలతో అన్నాడీఎంకె ప్రధాన కార్యదర్శి శశికళ జైలు బాట పట్టారు. అయితే తానే సీఎం అన్న ధీమాతో తిరుగుబాటు బావుటా ఎగరేసిన పన్నీర్ సెల్వం ప్లాన్ ను సైతం శశికళ తలకిందులు చేసేశారు.
ప్రభుత్వ పగ్గాలు ఎట్టి పరిస్థితుల్లోను పన్నీర్ చేతుల్లోకి వెళ్లకుండా కట్టడి చేశారు. రిసార్టులో ఎమ్మెల్యేలను దాచడం మొదలు.. వారిని పట్టు జారిపోకుండా కాపాడుకుంటూ వచ్చిన శశికళ.. చివరాఖరికి పళనిస్వామిని శాసనాసభాపక్ష నేతగా ప్రకటించిన తర్వాతే జైలుకెళ్లారు. మరుసటి రోజు సాయంత్రం పళనిస్వామి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.

ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని గురువారం నాడు జైల్లో శశికళ 'లైవ్' వీక్షించారు. వదిన ఇళవరసి, ఇతర ఖైదీలతో కలిసి పళనిస్వామి ప్రమాణస్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. కాగా, తాను జైల్లో ఉన్న సరే పళనిస్వామి చేత తన వ్యూహాలు అమలు చేయించాలనే యోచనలో శశికళ ఉన్నారు.
అమ్మకు పన్నీర్ ఎలాగో.. ఇప్పుడు చిన్నమ్మకు పళనిస్వామికి కూడా అలానే నమ్మకంగా పనిచేయనున్నారు. ఒకవిధంగా చిన్నమ చేతిలోని రిమోట్ కంట్రోల్ లా పళనిస్వామి పనిచేయనున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో పళనిస్వామి నేడు శశికళను కలవడానికి బెంగుళూరు పరప్పన జైలుకు వెళ్లనున్నారు. అక్కడ ఆయన శశికళతో ఏం మాట్లాడనున్నారు? ఆ తర్వాత ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు? అన్నది ఆసక్తిని రేకెత్తిస్తోన్న అంశం.












Click it and Unblock the Notifications