సీఎం పదవే లక్ష్యంగా శశికళ: అంతా తానై నడిపిస్తున్న ఉదయకుమార్
ఇటీవలే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా పదవీ బాధ్యతలు చేపట్టిన శశికళ.. త్వరలోనే సీఎం అవుతారని మంత్రి ఉదయకుమార్ ధీమాగా చెబుతున్నారు.
చెన్నై: గత రెండ్రోజుల క్రితమే తమ మద్దతుదారుల సహకారంతో అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రి పదవే లక్ష్యంగా పావులు కదుపుతోంది. శశికళను సీఎం కుర్చీలో కూర్చోబెట్టడమే లక్ష్యంగా మంత్రి ఆర్బీ ఉదయకుమార్ అన్నీతానై బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. అంతేగాక, త్వరలోనే శశికళ సీఎం పీఠంపై కూర్చుంటారని ధీమాగా చెబుతున్నారు.
In Pics: పగ్గాలు చేపట్టిన శశికళ
ఇది ఇలా ఉండగా, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా శశికళ పదవి చేపట్టడంపై ఆ పార్టీ కింది స్థాయి నేతలు, కార్యకర్తలు తీవ్ర నిరసన తెలుపుతున్నారు. అంతేగాక, రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల ఏర్పాటు చేసిన శశికళ బ్యానర్లను చించివేయడంతోపాటు బలవన్మరణాలకు యత్నిస్తున్న కార్యకర్తల వ్యవహారం వెలుగులోకి వస్తున్నాయి. అయితే, మరోపై నుంచి చిన్నమ్మే సీఎం పదవి చేపట్టాలనే నినాదాలు కూడా ఉద్ధృతంగానే వినిపిస్తున్నాయి.
అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, ముఖ్యమంత్రి బాధ్యతలను జయలలిత నిర్వహించారని, 'అమ్మ' వారసురాలిగా వచ్చిన శశికళ ప్రస్తుతం ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టిన నేపథ్యంలో ముఖ్యమంత్రి పదవి కూడా చేపట్టాలనే డిమాండ్లను ఆ పార్టీ నేతలు తెరపైకి తీసుకొస్తున్నారు. తాజాగా అన్నాడీఎంకే మంత్రులు పలువురు ఇదే డిమాండ్లను మరింత బలంగా వినిపిస్తున్నారు.

వారిలో ఆర్బీ ఉదయకుమార్, కడంబూర్ రాజు, చేవూర్ రామచంద్రన్, తంగమణి, ఓఎస్ మణియన్ తదితరులందరూ త్వరలోనే 'చిన్నమ్మ' ముఖ్యమంత్రి అవుతారంటూ ధీమాగా చెబుతుండటం గమనార్హం. కాగా, శశికళే అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిని చేపట్టాలంటూ డిమాండ్ను తెరపైకి తీసుకొచ్చిన వారిలో రాష్ట్రమంత్రి ఆర్బీ ఉదయకుమార్ ప్రముఖుడు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కూడా ఆమె బాధ్యతలు చేపట్టాలంటూ ఆయనే డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిణామంతో ఆర్బీ ఉదయకుమార్ ద్వారా అన్నాడీఎంకేలో చక్రం తిరుగుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శశికళ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు అనువుగా ఆమె జయలలిత మృతితో ఖాళీయైన ఆర్కేనగర్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికల్లో పోటీ చేయవచ్చనే వార్తలు వినిపిస్తున్నాయి. అదే సమయంలో విరుదునగర్ జిల్లా సాత్తూర్ నియోజకవర్గం నుంచి కూడా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధమవుతోందనే వాదనలూ ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో శశికళ సులభంగా గెలిచే అవకాశాలుండటంతో ఆమెను ఇక్కడ్నుంచే పోటీ చేయించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

కాగా, ప్రస్తుత సీఎం ఓ పన్నీరుసెల్వం కూడా చిన్నమ్మ(శశికళ)ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టాలనే విషయమై తన మంత్రివర్గ సహచరులతో చర్చించినట్లు తెలిసింది. ఈ పరిణామాల ద్వారా శశికళను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోబెట్టే దిశగానూ పావులు వేగంగా కదులుతున్నట్లు తెలుస్తోంది.
పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టినందుకే అన్నాడీఎంకేలో కిందిస్థాయి నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో నిరసనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో సీఎం పదవిని అప్పగించే వ్యవహారం దేనికి దారితీస్తుందోనని పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జయలలిత మేనకోడలు దీపా జయకుమార్.. శశికళపై గుర్రుగా ఉన్నారు. ఆమెకు వ్యతిరేకంగా త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనలు చేయనున్నట్లు సమాచారం.












Click it and Unblock the Notifications