క్షీణించిన ఢిల్లీ మంత్రి సత్యేందర్ జైన్ ఆరోగ్యం... మరో ఆస్పత్రికి తరలింపు...
ఇటీవల కరోనా వైరస్ బారినపడిన ఢిల్లీ విద్యాశాఖ మంత్రి సత్యేందర్ జైన్(55) ఆరోగ్యం మరింత క్షీణించింది. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఎక్కువ కావడంతో శ్వాస తీసుకోవడంలో ఆయన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో వెంటిలేటర్పై ఆయనకు ఆక్సిజన్ సపోర్ట్ అందిస్తున్నారు. అయితే మెరుగైన చికిత్స కోసం ఆయన్ను ప్రస్తుతం ఉన్న రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నుంచి మ్యాక్స్ ఆస్పత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
త్వరగా కోలుకోవాలని అమిత్ షా ట్వీట్..
గురువారం సత్యేందర్ తీవ్ర జ్వరంతో (జూన్ 17) రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరారు. ఈ విషయాన్ని ఆయనే ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఆ మరుసటి రోజు కరోనా టెస్టుల్లో ఆయనకు పాజిటివ్గా తేలింది. తాజాగా ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఢిల్లీ ప్రభుత్వంలో ఆందోళన మొదలైంది. జైన్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్టు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్విట్టర్ ద్వారా తెలిపారు.
మరో కోవిడ్ 19 ఆస్పత్రి ఏర్పాటు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండటంతో ఐసీయూ వార్డులు,పడకలను పెంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ఈ సాయంత్రం 5గం.కు వైద్యాధికారులతో చర్చించనున్నారు. రాధా స్వామి సత్సంగ్ బీస్ సెంటర్లో 10వేల పడకలతో మరో కోవిడ్ 19 ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నట్టు ఢిల్లీ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ బీఎం మిశ్రా తెలిపారు. ఇందులో 10శాతం ఆక్సిజన్ బెడ్స్ ఉంటాయని చెప్పారు. ఇప్పటివరకూ ఢిల్లీలో 49,979 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకూ 1969 మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం 26,669 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Recommended Video
కేబినెట్లోనే సత్యేంద్ర...
ఆదివారం కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేత్రుత్వంలో కరోనాపై జరిగిన అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశానికి జైన్ హాజరయ్యారు. ఈ సమావేశానికి కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష వర్దన్తో పాటు ముఖ్యమంత్రి కేజ్రీవాల్తో పాటు లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్,డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా హాజరయ్యారు. ప్రస్తుతం జైన్ ఆస్పత్రిలో ఉండటంతో.. విద్యా శాఖ బాధ్యతలను డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అప్పగించారు. ఆయన కేబినెట్లో కొనసాగుతారని,అయితే కోలుకునేంతవరకూ ఎలాంటి శాఖలు ఆయన వద్ద ఉండవని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు.