ఎస్బీఐ ఎండీకి కీలక బాధ్యతలను అప్పగించిన కేంద్రం
న్యూఢిల్లీ: భారతీయ రిజర్వ్ బ్యాంక్లో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఇప్పుడున్న డిప్యూటీ గవర్నర్ స్థానంలో కొత్త ఆర్థిక నిపుణుడిని నియమించింది. ఈ మేరకు కేంద్ర కేబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఈ నిర్ణయాన్ని తీసుకుంది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలపై ఆమోదముద్ర తెలిపింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ గవర్నర్గా స్వామినాథన్ జానకీరామన్ను అపాయింట్ చేసింది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుతం ఆయన స్టేట్ బ్యాంక్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్గా పని చేస్తోన్నారు. బాధ్యతలను స్వీకరించిన తేదీ నుంచి మూడు సంవత్సరాల పాటు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ హోదాలో కొనసాగుతారు.

ప్రస్తుతం డిప్యూటీ గవర్నర్గా పని చేస్తోన్న మహేష్ కుమార్ జైన్ పదవీకాలం ఈ నెలాఖరున ముగియనుంది. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మహేష్ కుమార్ జైన్ అయిదు సంవత్సరాల పాటు ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా పని చేశారు. తొలిసారిగా 2018 జూన్లో ఈ హోదాలో అపాయింట్ అయ్యారు.
2021 జూన్లో ఆయన పదవీకాలం ముగియగా.. మళ్లీ ఆయననే రీ అపాయింట్ చేసింది కేంద్రం. రెండు సంవత్సరాల కాల వ్యవధితో జైన్ను మళ్లీ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్గా నియమిస్తూ 2021 జూన్లో ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడా రెండేళ్ల పదవీ కాలం ముగిసిన నేపథ్యంలో- ఆయన స్థానంలో స్వామినాథన్ జానకీరామన్ను అపాయింట్ చేసింది.

డిపార్ట్మెంట్ ఆఫ్ సూపర్విజన్, ఫైనాన్షియల్ ఇంక్లూషన్ అండ్ డెవలప్మెంట్, కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ ప్రొటెక్షన్.. విభాగాలను స్వామినాథన్కు అప్పగించే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్లో ముగ్గురు డిప్యూటీ గవర్నర్లు పని చేస్తోన్నారు. మైఖెల్ డీ పాత్ర, టీ రబిశంకర్, రాజేశ్వర్ రావు డిప్యూటీ గవర్నర్లుగా ఉన్నారు.












Click it and Unblock the Notifications