Chandigarh Mayor: బీజేపీకి భారీ షాక్- చంఢీఘడ్ మేయర్ గా ఆప్ అభ్యర్ధి-సుప్రీం తీర్పు...!
కేంద్రపాలిత ప్రాంతం ఛండీఘడ్ లో తాజాగా జరిగిన మేయర్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి బీజేపీకి అనుకూలంగా వ్యవహరించడంపై గుర్రుగా ఉన్న సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ప్రకటించింది. గతంలో జరిగిన చంఢీఘడ్ మేయర్ ఎన్నికను రద్దు చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్దానం ప్రకటించింది. తిరిగి ఓట్లు లెక్కించి ఆప్ అభ్యర్ధి కుల్ దీప్ కుమార్ మేయర్ గా ఎన్నికైనట్లు ప్రకటించింది. ఈ మేరకు సీజే డీవై చంద్రచూడ్ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది.
గత నెలలో జరిగిన చంఢీఘడ్ మేయర్ ఎన్నికల్లో ఆప్ కు చెందిన 8 మంది సభ్యుల ఓట్లను చెల్లుబాటుకానివిగా ప్రకటించిన రిటర్నింగ్ అధికారి అనిల్ మాసే తీరుపై సుప్రీంకోర్టు తాజాగా తీవ్రంగా మండిపడింది. రిటర్నింగ్ అధికారి క్షమించరాని నేరం చేశారని వ్యాఖ్యానించింది. ప్రజాస్వామ్య ప్రక్రియకే మాయనిమచ్చగా వ్యవహరించిన ఆయనపై సుప్రీంకోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని ఉత్తర్వులు జారీ చేసింది.

అదే సమయంలో గతంలో బీజేపీకి చెందిన మేయర్ ఎన్నిక అక్రమమని నిర్దారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం.. తిరిగి గతంలో చెల్లనివిగా ప్రకటించిన 8 మంది ఆప్ సభ్యుల ఓట్లను కూడా కలిపి లెక్కించి మేయర్ ను ఎంపిక చేసింది. మేయర్ ఎన్నికపై స్టే విధించాలంటూ బీజేపీకి చెందిన పిటిషనర్లు చేసిన విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఆప్ అభ్యర్ధి కుల్దీప్ కుమార్ ను మేయర్ గా ప్రకటిస్తూ కీలక తీర్పు ప్రకటించింది. దీంతో బీజేపీకి వ్యతిరేకంగా జత కట్టిన ఇండియా కూటమి తొలి విజయం నమోదు చేసినట్లయింది.












Click it and Unblock the Notifications