కరోనా మృతుల కుటుంబాలకు భారీ ఊరట- సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు-ఎవరెవరికంటే ?
దేశవ్యాప్తంగా కరోనాతో చనిపోయిన వ్యక్తుల కుటుంబాలకు పరిహారం చెల్లించే విషయంలో సుప్రీంకోర్టు ఇవాళ మరో క్లారిటీ ఇచ్చింది. డెత్ సర్టిఫికేట్స్ లో కరోనాతో చనిపోయినట్లు ఉంటేనే పరిహారం చెల్లించాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. డెత్ సర్టిఫికేట్లో లేకపోయినా కరోనాతో చనిపోయారని తేలితే పరిహరం ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
కరోనాతో తమ కుటుంబ సభ్యుడు మృతిచెందినట్లు అతని కుటుంబంలో వారు ప్రభుత్వాన్ని సంతృప్తి పర్చగలిగితే చాలు, మరణ ధృవపత్రంలో కరోనా మరణం అని పేర్కొని ఉండాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు ఇవాళ తెలిపింది. కుటుంబ సభ్యులు కరోనా మరణంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని సంతృప్తి పరిస్తే చాలు రూ.50వేలు వరిహారం ఎలాంటి అడ్డంకులు లేకుండా చెల్లించాల్సిందేనని రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇలా కరోనా మృతులకు చెల్సించే పరిహారం ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సాయానికి అదనంగానే ఉండాలని జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ బోపన్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
అలాగే కోవిడ్ 19 ఆర్టీ పీసీఆర్ టెస్టులో కరోనా సోకినట్లు నిర్ధారణ అయిన తర్వాత నెలరోజుల్లో సదరు వ్యక్తి చనిపోతే .. అతనికి కచ్చితంగా పరిహారం ఇచ్చి తీరాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇతరత్రా కారణాలతో అతనికి పరిహారం నిరాకరించాల్సిన అవసరం లేదని తెలిపింది. ఇలాంటి కేసుల్లో రోగి ఇంటివద్ద చనిపోయాడా లేక ఆస్పత్రిలో చనిపోయాడా అన్నది చూడాల్సిన అవసరం కూడా లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. కోవిడ్ లేదా కోవిడ్ తదనంతర సమస్యలతో చనిపోయిన వారికి కూడా పరిహారం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని దాఖలైన ఓ పిటిషన్ విచారణ తర్వాత సుప్రీంకోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.
కరోనా మృతులుగా నిర్దారించిన తర్వాత పరిహారం కోసం దరఖాస్తు తమకు అందిన 30 రోజుల్లోగా రాష్ట్ర విపత్తు సహాయ నిధి నుంచి వారి కుటుంబ సభ్యులకు రూ.50 వేల పరిహారం చెల్లించాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. వాస్తవానికి కరోనా మృతులకు ఇచ్చే పరిహారాన్ని నిర్ణయించాలని జాతీయ విపత్తుల నివారణ సంస్ధ ఎన్డీఎంఏకు సుప్రీంకోర్టు జూన్ 30నే ఆదేశాలు ఇచ్చింది. అయితే ఆ తర్వాత కేంద్రం రూ.50 వేలు చెల్లించేందుకు సిద్ధమని సుప్రీంకోర్టుకు హామీ ఇవ్వడంతో ఆ మేరకు ఆదేశాలు వెలువరించింది.