ఐటీ చట్టం సెక్షన్ 66పై సుప్రీంకోర్టు నోటీసులు-రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకూ
ఆరేళ్ల క్రితం రద్దు చేసిన ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏను వాడుతూ ఇప్పటికే ప్రత్యర్ధులపై కేసులు నమోదు చేస్తున్న ప్రభుత్వాలపై సుప్రీంకోర్టు మరోసారి కన్నెర్ర చేసింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇవాళ నోటీసులు జారీ చేసింది. సెక్షన్ 66ఏ వినియోగంపై తమ అభిప్రాయాలు చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది.
ఇప్పటివరకూ ఐటీ చట్టంలోని సెక్షన్ 66ఏ కింద నమోదు చేసిన కేసులు, వాటిని ఉపసంహరించుకున్నారా లేదా అనే అంశాలతో వివరణ ఇవ్వాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికే ఓసారి ఈ సెక్షన్ వాడకంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు... ఆరేళ్ల క్రితం తాము రద్దు చేసిన సెక్షన్ ఇంకా ఎలా అమలు చేస్తున్నారని ప్రశ్నించింది. దీనిపై దాఖలైన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు వెంటనే ఈ కేసుల్ని ఉపసంహరించాలని ఆదేశాలు ఇచ్చింది.
సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత కూడా పలు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో నమోదైన ఐటీ సెక్షన్ 66ఏ కేసులపై ఆగ్రహంగా ఉన్న అత్యున్నత న్యాయస్ధానం.. తాజా పరిస్ధితిపై వివరాలతో అఫిడవిట్లు దాఖలు చేయాలని ఆదేశాలు ఇచ్చింది.
ఇందుకు నాలుగు వారాల గడువు విధించింది. ఆ లోపు సెక్షన్ 66ఏ కేసుల ఉపసంహరణపై తాజా వివరాలతో స్పందన తెలియజేయాలని ఆదేశించింది. ఇప్పటికే ఏపీతో పాటు పలు రాష్ట్రాల్లో సెక్షన్ 66ఏ కింద నమోదు చేసిన కేసుల్ని ప్రభుత్వాలు ఇంకా ఉపసంహరించలేదు. ఇలాంటి సమయంలో సుప్రీంకోర్టు ఆదేశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.