జస్టిస్ లోయా మృతిపై స్వతంత్ర దర్యాప్తుకు సుప్రీం నో, అనుమానాల్లేవన్న కోర్టు
న్యూఢిల్లీ: సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి బీహెచ్ లోయా మృతి కేసులో స్వతంత్ర దర్యాప్తు కోరుతూ దాఖలైన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు గురువారం నాడు ఉదయం కొట్టివేసింది.ఈ మేరకు సుప్రీంకోర్టు తీర్పును వెల్లడించింది.
స్వప్రయోజనాలను ఆశిస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను ఆమోదించబోమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పేసింది. కింది కోర్టుకు చెందిన నలుగురు జడ్జిల స్టేట్మెంట్లు అనుమానించడానికి ఎలాంటి కారణాలు లేవని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది . జస్టిస్ లోయాది సహాజ మరణమేనని కోర్టు విశ్వసిస్తోందని పేర్కొంటూ స్వతంత్ర విచారణ అవసరం లేదని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
సీబీఐ కోర్టు జస్టిస్ లోయా నాగపూర్ గెస్ట్హౌజ్లో మృతి చెందారు. గుండెపోటు కారణంగా లోయా మరణించినట్టుగా కేసు నమోదయ్యాయి లోయా మృతిపై అనుమానాలున్నాయని పేర్కొంటూ స్వతంత్ర విచారణ చేయాలని సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా, న్యాయమూర్తులు ఎ.ఎం.ఖాన్వల్కర్, డివై చంద్రచూడ్లతో కూడిన బెంచ్ గత మార్చి 16న తీర్పు రిజర్వ్ చేసింది.
ఈ కేసుకు సంబంధించిన తీర్పును గురువారం నాడు వెల్లడించింది. ఉద్దేశ్యపూర్వకంగానే కొందరు లోయా మృతిపై స్వతంత్ర దర్యాప్తు కోరుతున్నట్టు మహరాష్ట్ర ప్రభుత్వం కోర్టు ముందు వాదనను విన్పించింది. జస్టిస్ లోయా మృతిపై ఆయన సోదరి అనుమానాలు వ్యక్తం చేసింది.మరోవైపు తన తండ్రిది సహాజ మరణమేనని లోయా కుమారుడు ఈ ఏడాది జనవరిలో ప్రకటించారు.