అవినీతిపై సుప్రీం కొరడా: నోయిడాలోని ట్విన్ టవర్స్ను కూల్చేయాలన్న ధర్మాసనం..!!
ఢిల్లీ: రియల్ ఎస్టేట్ కంపెనీ సూపర్టెక్కు మంగళవారం సుప్రీంకోర్టు నుంచి భారీ ఎదురుదెబ్బ తగిలింది. నిబంధనలకు విరుద్ధంగా సూపర్ టెక్ కంపెనీ మరియు నోయిడా అథారిటీలు వ్యవహరించి నిర్మించిన రెండు 40-అంతస్తుల టవర్లను కూల్చివేయాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. ఇది కాకుండా, 12 శాతం వడ్డీతో పాటు ట్విన్ టవర్స్ యొక్క ఫ్లాట్ యజమానులకు ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించాలని సూపర్టెక్ను సుప్రీం కోర్టు ఆదేశించింది. అదే సమయంలో, టవర్ల కూల్చివేత ఖర్చును కూడా సూపర్టెక్ భరించాల్సి ఉంటుందని పేర్కొంది.
40 ఫ్లోర్లు ఉన్న ఈ ట్విన్ టవర్స్లో మొత్తం 900 వరకు ఫ్లాట్లు ఉన్నాయి. అయితే రియల్ ఎస్టేట్ సంస్థ సూపర్ టెక్ నోయిడా అథారిటీతో కుమ్మక్కై నిబంధనలకు విరుద్ధంగా ట్విన్ టవర్స్ను నిర్మించారని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. జస్టిస్ డీవై చంద్రచూడ్, మరియు జస్టిస్ షాలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది. ఇక ఈ ట్విన్ టవర్స్లోని ఫ్లాట్లను ఎవరైతే కొనుగోలు చేశారో అలాంటి వారికి వెంటనే డబ్బులు చెల్లించాలని అది కూడా 12శాతం వడ్డీతో చెల్లించాలని అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది. డబ్బులు చెల్లించేందుకు రెండు నెలల సమయం ఇచ్చింది కోర్టు.
Supreme Court orders demolition of two 40-floor towers built by real estate company Supertech in one of its housing projects in Noida; says construction was a result of the collusion between the officials of the Noida authority and Supertech pic.twitter.com/5Vx3rSmHCd
— ANI (@ANI) August 31, 2021
అధికారులు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇలా కుమ్మక్కు అయిన సందర్భాలు చాలా ఉన్నాయని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బిల్డింగ్ ప్లాన్లలో అవకతవకలు, నివాసితులతో బిల్టింగ్ ప్లాన్ను అధికారులు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించిన కోర్టు... నిబంధనలను గాలికొదిలేశాయని మండిపడింది. హైకోర్టు గతంలో విచారణ చేసి నోయిడా అథారిటీ మరియు రియల్ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కు అయ్యారంటూ స్పష్టం చేసిందన్న విషయాన్ని జస్టిస్ చంద్రచూడ్ గుర్తుచేశారు. ఇది కచ్చితంగా సురక్షిత నిబంధనలను ఉల్లంఘించేలా ఉందని కోర్టు అభిప్రాయపడింది. ఇక టవర్లు కూడా రెండు కనీస దూరం లేకుండా నిర్మాణం అయ్యాయని కోర్టుపేర్కొంది. టవర్ల నిర్మాణం కోసం గార్డెన్ ఏరియా నిబంధనలను కూడా ఉల్లంఘించారని పేర్కొంది.
అయితే వాదనల సందర్భంగా సూపర్టెక్ సంస్థ తరపున వాదించిన న్యాయవాది వికాస్ సింగ్ ఎలాంటి నిబంధనలను ఉల్లఘించలేదని కోర్టుకు తెలిపారు. నిర్మాణం ప్రారంభమైన సమయంలో కేసు ఫైల్ చేసిన రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇంకా ఏర్పాటు కాలేదని చెప్పారు. అంతేకాదు రెండుటవర్స్కు మధ్య కనీస దూరం అనే నిబంధనను పాటించినట్లు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఫైర్ సేఫ్టీతో పాటు ఇతర పారామీటర్లను కూడా పాటించామని వెల్లడించారు. గత నెలలో ఈ కేసు విచారణ సందర్భంగా కోర్టు నోయిడా అథారిటీపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫ్లాట్లను కొనుగోలు చేసిన వారికి ప్లాన్ ఎందుకు ఇవ్వలేదని మండిపడింది. అవినీతి అనేది ఇక్కడ రాజ్యమేలుతోందని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. అధికారాన్ని ఇక్కడ దుర్వినియోగం చేశారని స్పష్టమవుతోందని కోర్టు అభిప్రాయపడింది.

మొత్తానికి ఈ ట్విన్ టవర్స్లో ఒకదాన్ని యాపెక్స్ అని పేరు పెట్టగా మరో దానికి సీయేన్ అని పేరు పెట్టారు. ఈ రెండిటిలో కలిపి 915 అపార్ట్మెంట్లు ఉండగా 21 దుకాణాలు ఉన్నాయి. వీటిలో 633 ఫ్లాట్లను పలువురు బుక్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఈ వ్యవహారం ఎలాంటి మలుపు తీసుకుంటుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications